చంద్రబాబుకు జగన్ ఘాటు లేఖ: ప్రత్యేక హోదాపై యనమల
హైదరాబాద్/ విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారంనాడు బహిరంగ లేఖ రాశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా కుటిల వ్యూహాలకు శాసనసభను వేదికగా మార్చవద్దని జగన్ ఈ ఆ లేఖలో కోరారు.
కమిటీ ఆన్ జనరల్ పర్పసెస్ సమావేశం ఉద్దేశం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. 25 మంది కమిటీ సభ్యుల్లో తమ పార్టీకి చెందినవారిలో ముగ్గురికే అవకాశం ఇస్తారా అంటూ ఆయన అడిగారు. గత పుష్కరకాలంలో ఎన్నడూ ఈ సమావేశం జరగలేదని విమర్శించారు.

అసెంబ్లీలో వైఎస్ ఫొటోను తక్షణమే ఏర్పాటు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో 19 ప్రజా సమస్యలపై పోరాడుతామని జగన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై తాము ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో ధర్నా చేపట్టిన రోజునే సమావేశం ఏర్పాటు చేయడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన అడిగారు.
ఇదిలావు ఉంటే, ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అభివృద్ధిపై దృష్టి పెట్టామని, అభివృద్ధి కోసం అప్పులు కూడా చేస్తున్నామని చెప్పారు. విశాఖ ఆర్కే బీచ్లో పంద్రాగస్టు వేడుకల నిర్వహణపై మంత్రి చర్చించారు. ఏపీ విజన్ను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications