కుంభకర్ణుడికి పెద్దన్న, ఇకనైనా మారండి: బాబును లేఖలో ఏకిపారేసిన జగన్
అమరావతి: ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడును లక్ష్యంగా చేసుకుని విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబుకు శనివారం బహిరంగ లేఖ రాశారాయన. రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
అందుకే ఈ లేఖ..
జగన్ లేఖ వివరాల్లోకి వెళితే... ‘గడిచిన రెండు వారాలుగా...ప్రధానంగా గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలను, మొత్తంగా 13 జిల్లాలను అతలాకుతలం చేస్తున్న విషయం రాష్ట్రంలోని ప్రతి మీడియా కూడా విస్పష్టంగా చెబుతూ వస్తోంది. వరి, వేరుశెనగ, ఇతర నూనె గింజలు, పత్తి, ఉల్లి, మిరప, మినుము, కంది, మొక్కజొన్న, ఆముదం, ఇతర పంటలు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న విషయం మొత్తంగా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి వచ్చింది. రోడ్డు మార్గాలు తెగిపోయాయి. కొన్ని జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇలాంటి సమయంలో రైతుల ఆవేదన, ప్రజల ఆక్రందన పట్టించుకునే తీరిక మీకు లేకపోవడం నాకు ఆందోళనను కలిస్గున్నందువల్ల ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను' అని చెప్పారు.
రుణ మాఫీ ఒక మోసం.. మనసు కరగదు..
‘మీరు ప్రకటించిన రుణమాఫీ ఒక మోసం. ఇన్పుట్ సబ్సిడీలను ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ, పావలా వడ్డీ పథకాలను సంపూర్ణంగా మొత్తంగా రూ.87 వేల కోట్ల మేరకు మీరు అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న రుణాలను మాఫీ చేయకపోవడంతో ఆ తర్వాత ఏటా రూ.14,000 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.56,000 కోట్లు వడ్డీగా, అపరాధ వడ్డీగా చెల్లించుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. పంటలబీమా రైతులకు లభించకుండా మీ రుణమాఫీ వ్యవహారమే రాష్ట్ర రైతాంగాన్ని సర్వనాశనం చేసింది. గత మూడున్నర సంవత్సరాలుగా గిట్టుబాటు ధరల విషయంలో మీ ప్రభుత్వానిదే రాష్ట్ర రికార్డు. గిట్టుబాటు ధరలు పెంచడంలో కాదు, గిట్టుబాటు ధరలు పెరగకుండా చూడటంలో మీదొక రికార్డు. అంతకుముందు సంవత్సరాల్లో అందిన ధరలు కూడా అందక రైతులు నానా అగచాట్లకు గురైన పరిపాలన మీదే చంద్రబాబు నాయుడుగారూ. ఈ విషయంలో రైతులు ధర్నాలు చేసినా, మేం ధర్నాలు, దీక్షలు చేసినా మీ మనసు కరగలేదు' అని జగన తన లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వంలో చలనం లేదు.. మీకు తీరిక లేదు
‘ఈ సంవత్సరం ఖరీఫ్నే తీసుకుంటే...ఏకంగా 10 లక్షల ఎకరాలకుపైగా బీడుగా పడి ఉందని, విత్తనం పడలేదని పత్రికల్లో వార్తలు వచ్చినా మీ ప్రభుత్వంలో చలనం లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే బ్యాంకులు టార్గెట్ల మేరకు కూడా వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదు. ఇవ్వొద్దు అని ఎస్ఎల్బీసీ మీటింగులో మీరే స్వయంగా బ్యాంకర్లకు చెప్పారు. రుణాలు రాక, పెట్టుబడులు లేక పంట విస్తీర్ణం తగ్గింది. సకాలంలో వర్షాల పడక కొంతమేరకు పంటలు దెబ్బతింటే, ఇప్పుడు కురుస్తున్న వర్షాలు పంటలమీదా, రైతుల ఆశలమీదా మొత్తంగా రైతు జీవితంమీదా చూపుతున్న ప్రభావాన్ని చర్చించడానికి మీకు తీరికే లేదు.
Recommended Video
అదో ప్రచార డ్రామా..
‘రోమ్ తగలబడుతుంటే...నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్లు అన్న సామెతను అందరూ మరిచిపోయేలా చేసి మీరు సన్మానాలు, సత్కారాలు, ల్యాండ్ డీల్స్, విదేశీ ప్రతినిధులతో ఫోటోలు వంటి కార్యక్రమాల్లో గత నాలుగు రోజులుగా తలమునకలయ్యారని సీఎం డైలీ షెడ్యూల్ చూసిన ఎవరికైనా వెంటనే అర్థం అవుతుంది. రాష్ట్రంలో రైతు మునుగుతున్నా చలించని మనస్తత్వం మీకు ఎందుకు అబ్బింది చంద్రబాబుగారూ? ఈ నెల 11న మీ వ్యవసాయశాఖ ఇచ్చిన నివేదిక రెండో పేజీ చూస్తే రాష్ట్రంలోని పలు పంటలు నానా రకాల తెగుళ్లబారిన పడిన విషయం ఎవరికైనా అర్థం అవుతుంది. అయినా మీరు పట్టించుకునే తీరిక లేదు. వర్షాలు ప్రారంభం కాగానే అవి మీవల్లే కురుస్తున్నాయన్న ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి జలహారతి అంటూ ప్రచార డ్రామా ఆడారు. వర్షాలు ఎక్కువై రాష్ట్రంలోని రైతాంగమే మునిగిపోతుంటే మాత్రం కుంభకర్ణుడికి పెద్దన్న మాదిరిగా మీరు, మీ మంత్రిమండలి నిద్రపోతున్నారు. ఇదేమి ప్రభుత్వం చంద్రబాబు గారూ?' అంటూ జగన్ నిలదీశారు.
బాబూ గారూ మీరు మారండి..
‘రైతులు కష్టంలో ఉంటే... రాష్ట్రం నష్టపోతుంటే..మీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించాలని, పరుగులెత్తించాలని, మీరే స్వయంగా రంగంలోకి దిగాలని మీకు ఎందుకు అనిపించడంలేదో నాకు అర్థం కావడంలేదు. ఏ ఘన కార్యాయాలు చేస్తున్నారండీ...ఆ సెక్రటేరియట్లో? ఓ పక్కన రైతుల ఆత్మహత్యలు, ఇంకోపక్కన ఎప్పుడూ వినని విధంగా నిరుద్యోగుల ఆత్మహత్యలు, మరోవైపు మీ మంత్రుల కళాశాల్లోనే విద్యార్థుల ఆత్మహత్యలు...ఏమిటిది చంద్రబాబు గారూ? ఒక రైతు గుండెకోత కాని, తల్లిదండ్రుల కడుపుకోత కాని మిమ్మల్ని కదిలించడంలేదంటే.. ఎంత ఘోరం చంద్రబాబు గారూ ఇది! అయ్యా... మీరు మారండి..ప్రజల గురించి పట్టించుకోండి. నీరో పాలనకన్నా నారా పాలన ఘోరంగా ఉందని ఎందుకు అంటున్నామో ఆలోచించండి. ఇకనైనా కదలండి. రైతుల నష్టానికి పూర్తిగా పరిహారం ఇవ్వండి. విద్యార్థుల, నిరుద్యోగుల ఆత్మహత్యలల్లో మీ పాత్ర మీద ఆత్మపరిశీలన చేసుకోండి' అని వైయస్ జగన్ తన లేఖలో ప్రశ్నలు సంధించారు.