లక్షకోట్ల అప్పులు, గొంతు నొక్కేస్తున్నారు: రాష్ట్రపతికి జగన్ ఆవేదన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందంటూ ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ .
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందంటూ ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు. శాసనసభ సమావేశాలకు హాజరుకాకూడదని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందో ఆ లేఖలో వివరించారు.
ప్రలోభాలకు పాల్పడుతున్నారు..
అంతేగాక, చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు, ప్రలోభాలకు పాల్పడుతున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరితే అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ నుంచి స్పందన రాలేదని తెలిపారు.
లక్షకోట్లకు మించిన అప్పులు
ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అన్నది లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. గడచిన 41 నెలల్లో 1,09,422 కోట్ల రూపాయల అప్పులు చేశారని వెల్లడించారు.
గొంతు నొక్కేస్తున్నారు..
శాసనసభ సమావేశాలను అప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహిస్తున్నారని, సభలో విపక్షం గొంతు వినపడకుండా నొక్కేస్తున్నారని సీఎం చంద్రబాబుపై వైయస్ జగన్ రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏపీలో జరుగుతున్న ప్రజాస్వామ్య అపహాస్యాన్ని అడ్డుకోవాలని లేఖలో రాష్ట్రపతిని వైయస్ జగన్ కోరారు. చంద్రబాబు సర్కారు అక్రమాలు, అరాచకాలను పాల్పడుతోందంటూ రాష్ట్రపతికి ఆయన 5 పేజీల లేఖ రాశారు.
బాధాకరం..
చంద్రరాబు పరిపాలనను గాలికొదిలి అప్రజాస్వామికంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని ఇప్పటికే అప్పుల ఊబిలోకి నెట్టారని వైయస్ జగన్ అన్నారు.
బాధ్యతగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రే రాష్ట్రంలో అప్రజాస్వామిక చర్యలను ప్రోత్సహించడం బాధాకరమని తన లేఖను ఫేస్బుక్ పోస్టు చేస్తూ వ్యాఖ్యానించారు జగన్.