ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు: అసెంబ్లీకి నల్ల కండువాలతో జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు శనివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు ముందు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ పథకం ప్రకారమే రాజధానిని తుళ్లూరు ప్రాంతంలో ప్రకటించారని మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు నిస్సిగ్గుగా అవినీతి, మోసాలకు పాల్పడుతున్నారని, నిరంకుశ వైఖరితో పాలన సాగిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులను మభ్యపెట్టి వారి భూములను లాక్కున్నారని ఆరోపించారు. ఒక్కో వైసీపీ ఎమ్మెల్యేకు రూ. 30 కోట్లు ఇచ్చి టీడీపీలో చేర్చుకున్నారని మండిపడ్డారు.

ఎమ్మెల్యేల ఫిరాయింపులు, రాజధాని ప్రాంతంలో రైతుల భూములను లాక్కున్నందుకు గాను నిరసన తెలుపుతున్నామన్నారు. రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు తన బినామీలకు లభ్ది చేకూర్చేలా ఓ పథకం ప్రకారం ప్లాన్ చేశారని అన్నారు. రైతుల దగ్గర తన బినామీలంతా భూములు కొనుగోలు చేసిన తర్వాతే రాజధానిని అమరావతిలో పెట్టారని అన్నారు.
రాజధాని ప్రాంతంలోని ఎస్సీలను సైతం మోసం చేశారని అన్నారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన జోనింగ్ వ్యవస్థ చంద్రబాబు బినామీలకు లాభం చేకూర్చేలా ఉందన్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, అవినీతికి నిరసనగా తాము నిరసన తెలుపుతున్నామని జగన్ చెప్పారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు రవీంద్రభారతి నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా మెడలో నల్ల కండువాలు ధరించారు.
ఏపీ రాజధాని ప్రాంతంలో బినామీ పేర్లతో మంత్రులు, టీడీపీ నేతలు సాగిస్తున్న దందా గురించిన నినాదాలు, పత్రికా కథనాలను ప్లకార్డులుగా పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.మరోవైపు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి అసెంబ్లీకి బయల్దేరారు.
మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ జగన్, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రవీంద్రభారతి సర్కిల్కు చేరుకున్నారు. ప్రకాశం పంతులు విగ్రహం నుంచి వారు అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఫిరాయింపులు, అమరావతి భూదందాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ సమయంలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం నుంచి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు 18 రోజలపాటు కొనసాగనున్నాయి.












Click it and Unblock the Notifications