బాబు చేయగా నేను: జగన్, ప్రజలు భయపడ్డారు: టిడిపి
హైదరాబాద్: రైతు రుణమాఫీ చంద్రబాబు చేయగల్గినప్పుడు మేం ఎందుకు చేయలేమని తన పార్టీ వారిని, ఆర్థిక నిపుణులను తాను అడిగానని ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభలో అన్నారు. టిడిపి తమ ప్రచారంలో బాబు వస్తున్నాడు.. జాబు వస్తుందని, బాబు వస్తున్నాడు.. రుణాలు వెంటనే మాఫీ అయిపోతాయని జోరుగా ప్రచారం చేసిందన్నారు.
తాను మొదటిసారి మాట్లాడుతున్నానని, తనకు అనుభవం ఉందని, జగన్కు లేదని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. రుణమాఫీ పైన చంద్రబాబు చేస్తానని చెప్పినప్పుడు తాము ఎందుకు చేయలేమనే విషయమై తాము ఆలోచించాం.. చర్చించామన్నారు. ఏ రాష్ట్రంలోనైనా గతంలో ఇన్నివేల కోట్ల రుణాలను మాఫీ చేసిన చరిత్ర ఉందా అని తన వాళ్లను తాను అడిగానని చెప్పారు. అయితే వారు సాధ్యం కాదని చెప్పారన్నారు.
మరి, చంద్రబాబు ఎలా మాఫీ చేస్తారని తాను అడగగా.. ఇప్పుడు హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చాక ఆర్బీఐ, ఇతరులు అంగీకరించలేదని సాకు చెబుతారని తనకు తమ వాళ్లు చెప్పారన్నారు. అందుకే తాను రుణమాఫీపై హామీ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం చేస్తే తాము తప్పకుండా మద్దతిస్తామన్నారు.
రుణమాఫీ సాధ్యమైతే.. మూడేళ్లు పాలించి, ఆ తర్వాత రుణమాఫీపై సంతకం చేస్తే ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోడు కదా అని అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు తాను విలువలు, విశ్వసనీయతలు పాటిస్తున్నానని చెప్పారు. వాటిని పక్కన పెడితే ఈసారి ప్రజలు ఓటేసి గెలిపించినా.. ఆ తర్వాత పక్కన పెడతారన్నారు. ప్రజలు నమ్మగలిగే హామీలు మాత్రమే తాను ఇవ్వాలనుకున్నానని చెప్పారు. చంద్రబాబు వస్తే ఉన్న జాబులు పోయే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఆదర్శ రైతులను ఎందుకు పక్కన పెట్టారన్నారు.

మోసగాళ్లనుకున్నారు: యనమల
జగన్ ప్రసంగంపై యనమల స్పందిస్తూ... ఎవరి మేనిఫెస్టో వారికి ఉంటుందని, వారి వారి మేనిఫెస్టో వారిది అని, వారిని జనాలు మోసగాళ్లు అనుకున్నారు కాబట్టే అక్కడ (ప్రతిపక్షం) కూర్చుండబెట్టారన్నారు. ప్రజలు తమ మేనిఫెస్టోను నమ్మారని, వారి మేనిఫెస్టోను నమ్మలేదన్నారు. తమలాగే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా నేనొస్తున్నా అంటూ ప్రకటనలు ఇచ్చిందని, ఆ ప్రకటన చూసి ప్రజలు భయపడి ఓటు వేయలేదని యనమల చురకలు వేశారు.
మాఫీకి వ్యతిరేకమని అచ్చెన్నాయుడు
జగన్, వైయస్ రాజశేఖర రెడ్డిలు రైతు రుణమాఫీకి వ్యతిరేకమని అచ్చెన్నాయుడు అన్నారు. ఇచ్చిన హామీలన్నింటిని తాము నెరవేరుస్తామని చెప్పారు. రుణమాఫీపై మాట్లాడే హక్కు వారికి లేదన్నారు. రుణమాఫీపై అంత ఆతృత ఉంటే ప్రజల సొమ్ము లక్ష కోట్లు దోపిడీ చేశారని, దానిని ఇస్తే వెంటనే మాఫీ చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications