ఏపీలో జగన్ విధేయుల వీఆర్ఎస్ లు, రాజీనామాలు-తాజాగా ప్రవీణ్ ప్రకాష్ సహా..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులు మాత్రమే అవుతోంది. అంతలోనే మాజీ సీఎం వైఎస్ జగన్ కు గత ప్రభుత్వంలో విధేయులుగా వ్యవహరించిన అధికారులంతా ఒక్కొక్కరుగా తమ పదవుల్లో నుంచి తప్పుకుంటున్నారు.
అయితే రాజీనామా లేకపోతే వీఆర్ఎస్, కుదరకపోతే కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు సిద్దమైపోతున్నారు. ఈ జాబితా అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు చేరిపోయారు.

రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ లేనంతగా సీఎం జగన్ పై వీర విధేయత ప్రదర్శించిన అధికారులు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి టార్గెట్ గా మారారు. దీంతో వీరిని ఇప్పటికే ప్రభుత్వం పక్కనబెట్టేసింది. మాజీ ఇంటెల్ ఛీఫ్ సీతారామాంజనేయులు వంటి వారు చంద్రబాబు ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నా అపాయింట్ మెంట్ కూడా లభించని పరిస్ధితి. ఇదే కోవలో అప్పటి సీఎంవోలో పనిచేసిన అధికారులందరి పరిస్ధితీ ఇలాగా ఉంది. దీంతో సదరు అధికారులంతా తట్టాబుట్టా సర్దుకునే పనిలో బిజీగా ఉన్నారు.
ఇదే క్రమంలో గత సీఎంవోలో చక్రం తిప్పిన జగన్ వీర విధేయ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ తనకు వీఆర్ఎస్ ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం, దాన్ని ఆమోదించడం కూడా జరిగిపోయాయి. సెప్టెంబర్ 30 నుంచి వర్తించేలా తనకు వీఆర్ఎస్ ఇవ్వాలన్న ఆయన విజ్ఞప్తిని ప్రభుత్వం మన్నించింది. ఇదే కోవలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పదవిలో ఉన్న పీపీకే రామాచార్యులు నిన్న రాజీనామా సమర్పించారు. జగన్ సృష్టించిన సెక్రటరీ జనరల్ పదవిలో రిటైరైనా కొనసాగుతున్న ఆయన్ను తప్పుకోవాలని ప్రభుత్వం సంకేతాలు పంపడంతో నిన్న స్పీకర్, మండలి ఛైర్మన్ గా రాజీనామాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications