జగన్ కు దళిత సంఘాల షాక్- టూర్ అడ్డుకుంటామని వార్నింగ్..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు చేపట్టిన నర్సీపట్నం పర్యటన కలకలం రేపుతోంది. ఈ టూర్ లో భాగంగా జగన్ నర్సీపట్నం సమీపంలోని మాకవరపు పాలెంలో గతంలో వైసీపీ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. అయితే ఈ టూర్ కు ముందుగా అనుమతి ఇవ్వని పోలీసులు.. తాజాగా ఒత్తిడి పెరగడంతో సరేనన్నారు. పలు ఆంక్షలతో ఈ టూర్ కు పోలీసులు అనుమతి ఇచ్చినా జగన్ కు మరో ఇబ్బంది ఎదురవుతోంది.
జగన్ రేపటి నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. మెడికల్ కాలేజీల పర్యటనకు వస్తున్న జగన్ ను అడ్డుకుంటామని హెచ్చరించాయి. నర్సీపట్నం వచ్చేముందు గతంలో వైసీపీ హయాంలో చనిపోయిన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణ చెప్పానని కోరాయి. డాక్టర్ సుధాకర్ తల్లికి, వారి కుటుంబసభ్యులకు జగన్ సారీ చెప్పాల్సిందేనంటున్నాయి.

గతంలో కరోనా సమయంలో మాస్క్, కిట్ అడిగితే అందించలేని మీరు.. మెడికల్ కాలేజ్ కడతానంటే నమ్మాలా అని జగన్ ను దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వైద్యుడి ప్రాణాలనే కాపాడలేనివారు, మెడికల్ కాలేజీ ఎలా నిర్మిస్తారని నిలదీస్తున్నాయి.
డాక్టర్ సుధాకర్ మృతిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని దళిత సంఘాలు కోరాయి. సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణ చెప్పకపోతే పర్యటన అడ్డుకుని తీరుతామని దళిత సంఘాలు తేల్చిచెప్పేశాయి.

కరోనా సమయంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో అనస్తీషియా డాక్టర్ గా ఉన్న సుధాకర్ తమకు తగినన్ని మాస్క్ లు, పీపీఈ కిట్లు ఇవ్వలేదని బహిరంగ ఆరోపణలు చేయడంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయనపై కన్నెర్ర చేసింది. పోలీసులు కేసులు పెట్టి వేధించడంతో ఆయన మానసిక స్థితి క్షీణించింది. దీంతో ఆయన్ను కొంతకాలం వైజాగ్ లోని మానసిక వైద్యశాలలో ఉంచి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన కోలుకుని ప్రభుత్వంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించారు. అయితే ఆ తర్వాత అకస్మాత్తుగా గుండెపోటుకు గురై సుధాకర్ చనిపోయారు. దీనిపై సీబీఐ విచారణ జరిపినా ఏమీ తేలలేదు.












Click it and Unblock the Notifications