జగన్- నారా లోకేష్ కు కలిపి ఇచ్చిపడేసిన షర్మిల
YS Sharmila: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో చోటు చేసుకున్న పరిణామాలు.. రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి.
దీనిపై తాజాగా- టెన్త్ పరీక్షల నిర్వహణలో చంద్రబాబు, నారా లోకేష్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. వారి అవివేక, అనాలోచిత, పరిణతి రహిత నిర్ణయాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కష్టాలు ఎదురవుతున్నాయని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు.

దీనికి కౌంటర్ ఇచ్చింది టీడీపీ. జగన్ పై ఎదురుదాడికి దిగింది. జగన్ చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయారని ఆరోపించింది. అలాంటి జగన్ నుంచి హుందాతనం ఆశించడం తప్పేనని వ్యాఖ్యానించింది. ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన వైఎస్ జగన్ ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది.
వీరిద్దరి ఆరోపణలు- ప్రత్యారోపణల్లో జోక్యం చేసుకున్నారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల. పదో తరగతి పరీక్ష ఫలితాల రీ కౌంటింగ్ పై జగన్, నారా లోకేష్ మధ్య వాదనలు.. దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ హయంలో ప్రతి ఏటా రీ కౌంటింగ్ లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో 20 శాతం మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయ్యారని గుర్తు చేశారు.
ఇప్పుడు అదే విధానాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోందని షర్మిల ఆరోపించారు. రీవాల్యువేషన్ కోసం 30,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే వారిలో 11,000 మంది ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయని, దీన్ని బట్టి చూస్తే పేపర్ల మూల్యాంకనంపై కూటమి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమౌతోందని విమర్శించారు.
కూటమి ప్రభుత్వంలో పదో తరగతి పేపర్లు ఎంత క్రమశిక్షణతో దిద్దారో తెలుస్తోందని మంత్రి నారా లోకేష్ చురకలు అంటించారని, ఫలితాల్లో పారదర్శకత లేదని స్పష్టమైందని, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారనడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదని షర్మిల మండిపడ్డారు.
వాస్తవానికి ఇక్కడ ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదు.. పేపర్లు సరిగ్గా దిద్దలేని వైసీపీ, కూటమి ప్రభుత్వాలేనని షర్మిల అన్నారు. రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఈ రెండు పార్టీలు అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యాయని ఆరోపించారు.
పిల్లల భవిష్యత్ ను నిర్ణయించడంలో ఫెయిల్ అయిన జగన్, నారా లోకేష్.. రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. చదువులతో చెలగాటం ఆడుతున్నారని, విద్యార్థుల ప్రాణాలతో ఆటలు ఆడుకుంటున్నారని, ధనదాహం మీద ఉన్న శ్రద్ధ విద్యా వ్యవస్థను ఉద్ధరించడం మీద లేదని అన్నారు.
మొత్తం 60,000 పేపర్లు రీ కౌంటింగ్ కు వస్తే అందులో 11,000 మందికి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయంటే పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యమేనని, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఫెయిల్ అయినట్లేనని షర్మిల అన్నారు. మూల్యాంకనం వ్యవహారం మొత్తంపైనా వెంటనే విచారణ జరపాలని, పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి పేపర్ మళ్ళీ రీ వెరిఫికేషన్ ఉచితంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications