ఆళ్ల రామకృష్ణారెడ్డిపై షర్మిల షాకింగ్ కామెంట్స్
YS Sharmila: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకొన్న ఆయన.. నెల రోజుల వ్యవధిలో మళ్లీ సొంతగూటికి చేరుకోవడంపై స్పందించారు.
తనకు టికెట్ లభించదనే ఉద్దేశంతో మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి.. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల చేతుల మీదుగా కండువా కప్పుకొన్నారు.

ఆ కొద్దిరోజుల్లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. సొంతగూటికి చేరుకున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తాననీ ప్రకటించారు.
ఈ పరిణామాలపై వైఎస్ షర్మిల స్పందించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంతగూటికి చేరుకోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తనకు అన్నలాంటివాడని పేర్కొన్నారు. తనపై అభిమానంతో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారని, కాంగ్రెస్లో చేరారని గుర్తు చేశారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు చాలా దగ్గర మనిషిగా అభివర్ణించారు. ఆయన ఎక్కడున్నా బాగుండాలని, సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు. అందరితో సమానంగా ఉండాలి.. అదే స్థాయిలో గౌరవాన్ని పొందాలని షర్మిల వ్యాఖ్యానించారు. ఆళ్ల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయని, అందుకే సొంతగూటికి వెళ్లి ఉండొచ్చని చెప్పారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నారో.. ఓ చెల్లెలిగా అర్థం చేసుకున్నానని షర్మిల పేర్కొన్నారు. ఒక మంచి వ్యక్తి.. ఓ రాంగ్ ప్లేస్లో ఉన్నారని, ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని షర్మిల చెప్పారు.












Click it and Unblock the Notifications