వైఎస్ షర్మిల మరో కీలక అడుగు..! జగన్ వెళ్లలేని చోటుకు టూర్..!
ఏపీలో అధికార కూటమికి తోక పార్టీగా విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ బాస్ వైఎస్ షర్మిల మరో కీలక అడుగు వేయబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో తమపై ఉన్న ముద్రను చెరిపేసుకోవడంతో పాటు క్షేత్రస్దాయిలో వరుస పర్యటనలు చేస్తున్న షర్మిల రేపు మరో కీలక పర్యటనకు సిద్దమయ్యారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ప్రకటించారు. అయితే ఈ టూర్ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న రాజధాని ప్రాంతంలో కావడం మరో విశేషం.
రాష్ట్రంలో గతేడాది ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోని బలోపేతం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో సమస్యలను అందరి కంటే ముందే గుర్తించి స్పందించడంతో పాటు ఆయా ప్రాంతాలకు వెళ్లి మరీ బాధితుల్ని పరామర్శిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న వైసీపీతో పోలిస్తే చాలా విషయాల్లో ముందుంటున్న షర్మిల.. ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీట్ చేయబోతున్నారు.

అమరావతి రాజధాని ప్రాంతంలో పనుల పురోగతి, రాజధానిలో రెండో విడత భూసేకరణ నేపథ్యంలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో రేపు ఇక్కడ పర్యటించేందుకు షర్మిల సిద్ధమయ్యారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరనున్న షర్మిల రాజధానిలోని తుళ్లూరు మండలంలో ఉన్న ఉద్దండరాయుని పాలెం గ్రామానికి చేరుకుంటారు. అక్కడే ఆమె ప్రెస్ మీట్ నిర్వహించేందుకు సిద్దమయ్యారు.
రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు ఉద్దండ రాయుని పాలెం వద్ద 2015లో ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించి అక్కడే షర్మిల ప్రెస్ మీట్ నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాజధాని రెండో విడత భూసేకరణ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో షర్మిల టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే అమరావతి విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపని నేపథ్యంలో షర్మిల టూర్ కు సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications