మీ ఇద్దరిదీ తప్పే..! చంద్రబాబు, జగన్ పై షర్మిల షాకింగ్..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా పల్నాడు జిల్లా టూర్ లో తన కారు కింద పడి సింగయ్య అనే ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో జగన్ ను ఈ స్ధాయిలో నిబంధనలకు విరుద్దంగా భారీగా వాహనాలతో ర్యాలీ చేస్తుంటే ఎందుకు వదిలేశారంటూ సీఎం చంద్రబాబును సైతం ప్రశ్నించారు. ఈ ఘటనకు ఇద్దరూ బాధ్యులేనని ఆమె తేల్చేసారు.
జగన్ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం అన్నారు. ఈ ఘటన ఒళ్ళు గగుర్పొడిచేలా ఉందన్నారు. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటన్నారు. 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ చేతులూపడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బెట్టింగ్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా అని అడిగారు. ఇదేం రాజకీయం ? ఇదెక్కడి రాక్షస ఆనందం ? అని జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.

మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా ?, ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా ?, కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా ? అని షర్మిల ప్రశ్నలు సంధించారు. ఇది పూర్తిగా జగన్ బాధ్యత రాహిత్యాని అద్దం పడుతుందన్నారు. బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్ ..100 మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి మరి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలన్నారు.

పర్మిషన్ కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారని షర్మిల ప్రశ్నించారు. ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారని అడిగారు. ఎందుకు ఇంటలిజెన్స్ వ్యవస్థను నిద్ర పుచ్చారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? కాంగ్రెస్ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌజ్ అరెస్ట్ లు చేస్తారని గుర్తుచేశారు. దీక్షలను భగ్నం చేస్తారు. ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారని ఆక్షేపించారు.వైసీపీ చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని అడిగారు.












Click it and Unblock the Notifications