వైఎస్ జగన్ కు షర్మిల కొట్టిన అసలు దెబ్బ ఇదే..! ఆస్తులను మించిన కష్టం.. !
ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం తర్వాత చెల్లెలు వైఎస్ షర్మిల విషయంలో వైఎస్ జగన్ అనుసరించిన వైఖరి ఇప్పుడు ఆయనకు శాపంగా మారుతోంది. ముఖ్యంగా ఆస్తి పంపకాల విషయంలో ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న షర్మిల.. తాజాగా జగన్ ఎన్సీఎల్టీలో వేసిన పిటిషన్ తో భగ్గుమన్నారు. ఆ తర్వాత షర్మిల వేస్తున్న అడుగులు.. ఆమెకు మద్దతుగా తల్లి విజయమ్మ రాసిన లేఖ ఘన చరిత్ర కలిగిన వైఎస్ కుటుంబాన్ని కుదిపేస్తున్నాయి. అంతకు మించి జగన్ కు నష్టం చేస్తున్నాయి.
వైఎస్ అంటేనే విశ్వసనీయత. అదే విశ్వసనీయతను పదింతలు పెంచుకునేలా జగన్ గతంలో వేసిన అడుగులు ఆయన్ను ఏపీ చరిత్రలో కనీవినీ ఎరుగని మెజార్టీ, అధికారాన్ని కట్టబెట్టాయి. అయితే ఆ తర్వాత ఆయన వేసిన అడుగులు అదే విశ్వసనీయతను ప్రశ్నార్ధకంగా మార్చేశాయి. అదే చివరికి సొంత చెల్లెలు షర్మిలను రాజకీయ పార్టీ పెట్టే దిశగా ప్రోత్సహించడంతో పాటు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించే దిశగా అడుగులు వేయించింది. ఇప్పుడు జగన్ చేసిన మరో తప్పిదం షర్మిల, విజయమ్మను ఏకం చేయడమే కాకుండా వారిద్దరినీ ఆయనకు ఆగర్భ శత్రువుల్లా మారుస్తున్నాయి.

పైకి కనిపిస్తోంది జగన్-షర్మిల మధ్య ఆస్తుల పోరాటమే. కానీ దీని మాటున జగన్ కు జరుగుతున్న నష్టం అంచనాలకు అందడం లేదు. ఎందుకంటే ఇంట్లో గొడవలు అయితే కేవలం ఇంట్లో చర్చించుకుంటేనో, రాజీ పడితేనో సర్దుకుంటాయి. కానీ అవి ఓసారి రచ్చకెక్కితే మాత్రం జనంలో ప్రతిష్టను పలుచన చేస్తాయి. అదీ ఎంతో చరిత్ర ఉన్న వైఎస్ కుటుంబం రచ్చకెక్కడం వల్ల రాజకీయాల పరంగా, ఆస్తుల పరంగా, పరపతి పరంగా నామమాత్రంగా ఉన్న షర్మిల కంటే వైఎస్ జగన్ కు తీవ్ర నష్టంగా మారబోతున్నాయి.
రేపోమాపో చెల్లెలు షర్మిలతో ఆస్తుల వివాదాన్ని జగన్ రాజీ చేసుకోవచ్చు. కానీ గత ఎన్నికల్లో, ఆ తర్వాత షర్మిల ఆయనకు చేసిన నష్టం రాజకీయంగా, మానసికంగా ఎప్పటికీ తీరేది కాదు. ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా అడుగులు ఎటు వేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న జగన్ కు ఇప్పుడు చెల్లెలు రూపంలో ఎదురైన చికాకు మరింత నష్టం చేస్తోంది. అదీ మహిళల విషయంలో జగన్ వైఖరి జనంలో రోజూ చర్చనీయాంశం అవుతోంది. దీంతో భవిష్యత్తులో దీన్ని కవర్ చేసుకోవడం జగన్ కు కష్టం కావచ్చనే అంచనాలున్నాయి.
మరోవైపు ఇండియా కూటమి దిశగా అడుగులు వేసేందుకు సిద్దమైన జగన్ కు ఇప్పుడు షర్మిల వేస్తున్న బ్రేకులు భవిష్యత్తులో ఆమెతో ఆస్తుల విషయంలోనే కాదు పొత్తు, సీట్ల విషయంలోనూ రాజీ కోసం బేరసారాలు ఆడుకోవాల్సిన పరిస్ధితిని తీసుకు రాబోతోంది. షర్మిలను కాదని జగన్ ను అక్కున చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్దంగా లేదు. అందుకే కూటమి సర్కార్ దాడులపై ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ కు ఇండియా కూటమి పక్షాలు సంఘీభావం ప్రకటించినా కాంగ్రెస్ దూరంగా ఉండిపోయింది. ఈ విషయాన్ని ఆ తర్వాత జగన్ స్వయంగా ప్రస్తావించాల్సిన పరిస్ధితి వచ్చింది. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఆస్తుల పోరును ముగిస్తే తప్ప రాజకీయంగా జగన్ కుదురుకోవడం కష్టంగా మారనుంది.












Click it and Unblock the Notifications