వైసిపి ఎంపీలను పరామర్శించేందుకు...ఢిల్లీకి వెళ్లనున్న వైఎస్ విజయమ్మ
కడప:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీ పదవులను వదులుకొని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న లోక్ సభ సభ్యుల దీక్షా శిబిరాన్ని ఆమె ఆదివారం పరామర్శించనున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయనను ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డిని వైఎస్ విజయమ్మ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించనున్నారు. వైసిపి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్
పాదయాత్రలో ఉన్నందువల్ల ఆయన ప్రతినిధిగా విజయమ్మ ఢిల్లీ వెళుతున్నట్లు తెలిసింది.

ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తమ పోరాటంలో భాగంగా వైఎస్సార్సీపీ ఎంపీలు పదవులకు రాజీనామా చేసి ఢిల్లీలోని ఏపీ భవన్లో నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దీక్షలో పాల్గొంటున్న వైసీపీ ఎంపీ మిథున్రెడ్డిని ఢిల్లీలో ఆయన తల్లి స్వర్ణమ్మ శనివారం కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన కుమారుడు మిథున్ ఎంపీ పదవికి రాజీనామా చేయడం గర్వంగా ఉందన్నారు. రాజకీయ నేతలకు పదవులు, డబ్బు ఆశ ఉండకూడదని, రాష్ట్రం కోసం మరింత పోరాటం చేయాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications