వివేకా హత్య కేసు: సీబీఐ అదుపులో పులివెందుల వైసీపీ నేత : దస్తగిరి వాంగ్మూలంతో వేగంగా ముందుకు..!!
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. వివేకా వద్ద డ్రైవర్ గా పని చేసిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో ఒక్క సారిగా రాజకీయ కలకం మొదలైంది. హత్య ఎవరు చేసారు .. ఏం జరిగింది...అసలు నిందితులు ఏం చెప్పారనే అంశం గురించి దస్తగిరి పూర్తి వివరాలు చెప్పినట్లుగా సీబీఐ కోర్టులో స్టేట్ మెంట్ ద్వారా తెలిసింది. సీఆర్పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు దస్తగిరి చెప్పినట్లు సీబీఐ స్టేట్మెంట్లో రికార్డు చేసింది.
దస్తగిరి వాంగ్మూలంతో వేగంగా అడుగులు
ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు చెప్పిన దస్తగిరి దీనికి మొత్తం మూలం బెంగళూరులోని భూవివాదమే అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.. బెంగళూరు భూమిలో వాటా ఇవ్వకపోవడంపై ఎర్ర గంగిరెడ్డి కోపం పెంచుకున్నారని చెప్పుకొచ్చారు. వివేకా ఇంట్లోకి వెళ్లి గంగిరెడ్డి తలుపులు తీస్తే తాము లోపలకు వెళ్లామని చెబుతూ..ఎవరు వివేకా పైన దాడి చేసింది వెల్లడించారు.
జరిగిన మొత్తం స్టేట్ మెంట్ రూపంలో
హత్య చేసిన తరువాత తనకు కోటి రూపాయలు ఇస్తూ..సునీల్ అందులో సునీల్ 25 లక్షలు తీసుకున్నారని చెప్పాడు. మిగిలిన మొత్తం తాను తన స్నేహితుడి వద్ద ఉంచానని చెప్పుకొచ్చాడు. హత్య జరిగిన తరువాత గోడ దూకి ఉమాశంకర్ రెడ్డితో సహా అందరూ పారిపోయారని చెప్పాడు. ఇక, తమకు ఎర్రగంగిరెడ్డి తరువాత ధైర్యం చెప్పాడని... ఎంపీ అవినాశ్... శంకరెడ్డి చూసుంటారని చెప్పినట్లగా దస్తగిరి తన వాంగ్మూలంలో స్పష్టం చేసాడు. అయితే, దీని పైన వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు.
కీలక అనుమానితుడు అరెస్ట్
అవినాశ్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని..తాను హత్య చేసానని చెప్పినా దస్తగిరిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఎమ్మెల్యే రాచమల్లు ప్రశ్నించారు. ఇక, ఈ కేసులో అనుమానితుడుగా పేర్కొంటున్న వైసీపీ పులివెందుల నేత దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పులివెందులకు చెందిన శంకర్ రెడ్డి అనారోగ్య కారణం వల్ల రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళినట్లు సమాచారం. హైదరాబాద్లో ఓ ప్రైవేటు హాస్పటల్లో ఆయనను సీబీఐ బృందం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం శివశంకర్రెడ్డిని హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి శంకర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. ఇదే సమయంలో దస్తగిరి వంగ్మూలం ఆధారంగా సీబీఐ వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ కనిపిస్తోంది.