వైఎస్ వివేకా హత్యకేసులో కీలక మలుపు: సీబీఐ అదనపు ఎస్పీపై కడప పోలీసులు కేసు నమోదు
కడప: రాష్ట్రంలో రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. ఇదివరకు ఈ కేసులో కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ పీ వరుణ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆ తరువాత ఈ కేసుకు కూడా స్థానచలనం కలిగింది. ఈ కేసు సమగ్ర దర్యాప్తు మొత్తం పులివెందుల నుంచి కడప న్యాయస్థానానికి బదిలీ అయింది.

సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్గా ప్రకాష్
కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ పీ వరుణ్ రెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయనను ఒంగోలు సెంట్రల్ జైలుకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో- ఒంగోలు జైలు సూపరింటెండెంట్గా పని చేస్తోన్న ప్రకాష్ను నియమించింది. ఈ హైప్రొఫైల్ హత్యకేసులో అరెస్టయిన నిందితులు ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో విచారణను ఎదుర్కొంటోన్నారు. వారికి ప్రాణహాని ఉందంటూ తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ బదిలీ చోటు చేసుకుంది.

కడపకు బదిలీ..
మంగళవారం ఈ కేసు కడప సీబీఐ ట్రిబ్యునల్ న్యాయస్థానానికి బదిలీ అయింది. సీబీఐ అధికారులు చేసిన అభ్యర్థన మేరకు పులివెందుల న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరో కీలక మలుపు తీసుకుంది వైఎస్ వివేకా హత్యకేసు. ఈ కేసును విచారణ చేస్తోన్న సీబీఐ అదనపు ఎస్పీ రామ్సింగ్పై కేసు నమోదైంది. మేజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు ఆయనపై కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

యురేనింగ్ ఉద్యోగి ఫిర్యాదు..
రామ్సింగ్ తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని యురేనియం కార్పొరేషన్ ఉద్యోగి గజ్జల ఉదయ్ భాస్కర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ పేరుతో రామ్సింగ్ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ ఆయన కడప జిల్లా ఏఆర్ ఎస్పీ మహేష్కుమార్కు ఫిర్యాదు చేశారు. అనంతరం జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

గతంలోనూ తెరమీదికి
వైఎస్ వివేక హత్య కేసులో ఇదివరకు కూడా రామ్సింగ్ పేరు తెరమీదికి వచ్చింది. తాము చెప్పినట్లు స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఆయన అనంతపురం జిల్లాకు చెందిన గంగాధర రెడ్డిని వేధించినట్టు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. డీఎస్పీ, సీఐలపైనా ఆయన ఒత్తిళ్లు తీసుకొచ్చారని తేలింది. ఈ కేసులో రామ్సింగ్ తమను ఉద్దేశపూరకంగా ఒత్తిళ్లకు గురి చేస్తోన్నారంటూ డీఎస్పీ వాసుదేవన్, సీఐ శంకరయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

నిందితులు రిమాండ్కు
ఈ కేసులో ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు పులివెందుల మెజిస్ట్రేట్ సమక్షానికి హాజరు పరిచారు. కడప కేంద్ర కారాగారంలో విచారణను ఎదుర్కొంటోన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలను కూడా పులివెందుల కోర్టుకు తీసుకొచ్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో హాజరు కాలేదు. ఆయన కడప రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. వారి రిమాండ్ను పులివెందుల కోర్టు పొడిగించింది.












Click it and Unblock the Notifications