జగన్ తిరుమలను సందర్శించనున్న వేళ.. వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించిన నారా లోకేష్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- ఇవ్వాళ తిరుమలను సందర్శించనున్నారు. వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రజల తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం పెదశేషవాహన సేవలో పాల్గొననున్నారు. అంతకుముందు- తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారిని కూడా దర్శించుకోనున్నారాయన. అనంతరం అలిపిరి వద్ద వంద ఎలక్ట్రిక్ బస్సులు, రేపు తిరుమలలో పరకామణి మహామండపం, అతిథి గృహాన్ని ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి నేరుగా నంద్యాల జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తారు. కొలిమిగుండ్లల్లో కొత్తగా నిర్మించిన రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీని వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. జిల్లాగా ఆవిర్భవించిన తరువాత వైఎస్ జగన్ నంద్యాల పర్యటనకు వెళ్లనుండటం ఇదే తొలిసారి. అనంతరం ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలతో వర్క్షాప్ను నిర్వహించనున్నారు. ఇదివరకు రెండుసార్లు వాయిదా పడిన ప్రోగ్రామ్ ఇది. బుధవారం ఈ కీలక సమావేశం షెడ్యూల్ అయింది.
ఇంకొన్ని గంటల్లో వైఎస్ జగన్ తిరుమలకు బయలుదేరి వెళ్లాల్సి ఉండగా.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కీలక అంశాన్నిప్రస్తావించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని తెర మీదికి తీసుకొచ్చారు. సీబీఐ దర్యాప్తు కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నారా లోకేష్- ఈ ఘటనపై జగన్కు కీలక ప్రశ్నను సంధించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ట్వీట్లు పోస్ట్ చేశారు.
వైఎస్ వివేకా హత్యకేసుతో తనకు గానీ, తన కుటుంబానికి సంబంధం లేదంటూ తాను గత ఏడాది ఏప్రిల్ 14వ తేదీన కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశానని గుర్తు చేశారు. ఈ హత్యతో తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చెయ్యడానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఈ సాయంత్రం ఎలాగూ తిరుమల వెళ్తున్నారని, శ్రీవారి వద్ద ఈ ప్రమాణం చేస్తారా?.. లేక బాబాయ్పై గొడ్డలి పోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు.