YS Vivekananda Reddy Murder Case: చావు బతుకుల్లో వివేకా హత్య కీలక సాక్షి !
ఏపీలో ఐదేళ్ల క్రితం జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఆయన ఇంటి వాచ్ మెన్ రంగయ్య ఆరోగ్య పరిస్ధితి విషమిస్తోంది. ఇప్పటికే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. తాజాగా మరోసారి అనారోగ్యం పాలవ్వడంతో కడప రిమ్స్ కు తరలించారు. అయితే శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జిషీట్ కోర్టులో నిలబడాలంటే ఆయన ఇచ్చిన వాంగ్మూలం చాలా కీలకంగా ఉంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పులివెందుల ఇంటికి సుదీర్ఘాలంగావాచ్ మెన్ గా ఉంటున్న రంగయ్య ఆయన హత్య జరిగిన రోజు కూడా అక్కడే కాపలాగా ఉన్నారు. అయితే ఆయన ముందే నిందితులు వివేకా ఇంట్లోకి ప్రవేశించడం, దారుణంగా హత్య చేయడం జరిగిపోయాయి. దీనిపై నోరు విప్పితే చంపేస్తామని నిందితులు బెదిరించడంతో చాలాకాలం మౌనంగా ఉన్న రంగయ్య ఆ తర్వాత సీబీఐ ముందు నోరు విప్పారు. దీంతో అసలు గుట్టు బయటపడింది.

వివేకా హత్య తర్వాత సీబీఐ రంగంలోకి దిగినా రంగయ్య వాంగ్మూలం మాత్రం నమోదు కాలేదు. కానీ క్రమంగా సీబీఐపై నమ్మకం కుదరడంతో రంగయ్య జరిగిన విషయాన్ని వెల్లడించారు. దీంతో సీబీఐ ఎఫ్ఐఆర్ లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పేర్లను చేర్చింది. అలాగే మిగిలిన నిందితులకూ ఉచ్చు బిగుసుకుంది. ఆ తర్వాత వీరంతా జైలు పాలయ్యారు. ఈ క్రమంలో రంగయ్యకు బెదిరింపులు కూడా తప్పలేదు. ఈ టెన్షన్లను రంగయ్య పలుమార్లు అనారోగ్యం పాలయ్యారు. దీంతో సీబీఐ స్వయంగా జోక్యం చేసుకుని ఆయనకు మెరుగైన చికిత్స అందేలా చూసింది.
ఇప్పుడు మరోసారి రంగయ్య అనారోగ్యం పాలవ్వడం, కడప రిమ్స్ లో చికిత్స పొందుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. రంగయ్య ఆరోగ్య పరిస్ధితి దృష్ట్యా చూస్తే ఆయన ఎక్కువ కాలం బతికేలా లేరు. అదే సమయంలో వివేకా కేసును లాజికల్ ఎండ్ కు తీసుకురావడంలో సీబీఐ విఫలమవుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండటంతో ఈ కేసు విషయంలో సీబీఐకి పూర్తి సహకారం లభించే అవకాశముంది.












Click it and Unblock the Notifications