వైసీపీకి ఓటేయొద్దన్న వివేకా కుమార్తె సునీత ! ముసుగు తొలిగిపోయిందన్న సజ్జల..!
ఏపీలో ఎన్నికల వేళ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వివేకా హత్య కేసు దర్యాప్తుకు జగన్ అడ్డుపడుతున్నారంటూ ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న ఆయన కుమార్తె సునీతారెడ్డి ఇవాళ డోస్ పెంచారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హంతకులు పాలకులుగా ఉండకూడదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.అంతే కాదు వచ్చే ఎన్నికల్లో తన అన్న పార్టీ(వైసీపీ)కి ఓటేయొద్దని పిలుపునిచ్చారు. దీనిపై వైసీపీ కీలక నేత సజ్జల మండిపడ్డారు.
తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై న్యాయం కోరుతూ ఐదేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదంటూ సునీత ఇవాళ ఆరోపించారు. తనకు ప్రజాకోర్టులో తీర్పు కావాలన్నారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత వాళ్లే మోసం చేయడంలో వివేకా ఓటమి చవిచూశారని, ఆ తర్వాత ఆయన్ను ఏమీ చేయలేమని భావించి ప్రతీకారం పెంచుకుని హతమార్చారన్నారు. ఆ తర్వాత హంతకులు తమ మధ్యే తిరిగారన్నారు. తన తండ్రి హంతకుల్ని జగన్ రక్షిస్తున్నారని ఆరోపించారు. కాబట్టి మరోసారి ఇదే ప్రభుత్వం వస్తే కష్టాలు ఉంటాయని, అందుకే వైసీపీకి ఓటేయొద్దని కోరారు.

జగన్ పాత్రపై దర్యాప్తు జరగాలని, నిర్దోషి అయితే వదిలేయాలని సునీతారెడ్డి కోరారు. మొదట్లో తనకు జగన్ పై అనుమానం రాలేదని, ఒక్కో విషయం బయటికి వస్తుంటే అనుమానించాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టడం, అవినాష్ అరెస్టు కాకుండా అడ్డుకోవడం వంటి అంశాల్ని ఆమె ప్రస్తావించారు. సీబీఐ అధికారులపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో దీన్ని బట్టి అర్దమవుతోందన్నారు.
సునీతారెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. సునీత ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పలికించే చిలక పలుకులు సునీత పలుకుతున్నారన్నారు. వివేకాపై కుట్ర ఎవరు చేసుండాలి, ఆదినారాయణరెడ్డి కుట్ర పన్నాలన్నారు. వివేకా మర్డర్ తర్వాత టీడీపీ ప్రభుత్వమే ఉందని గుర్తుచేశారు. రెండు నెలలు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు విచారణ చేయలేదని నిలదీశారు. చంద్రబాబు ఆమెను ఉసికొల్పి ఇలాంటివి మాట్లాడిస్తూన్నారన్నారు. సునీత ఇన్నాళ్లు వేసుకున్న ముసుగు తొలగిపోయిందన్నారు.












Click it and Unblock the Notifications