జగన్ దోస్తీ, బిజెపి వ్యూహం ఇలా : చంద్రబాబు కౌంటర్ ఇదీ...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన మార్పులు జరుగబోతున్నాయా? అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన మార్పులు జరుగబోతున్నాయా? అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి.. కేంద్రంలోని అధికార ఎన్డీయే గూటికి చేరనున్నారా? అంటే అందుకు సానుకూల పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తున్నది.
ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతు మద్దతు! ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ అదే తీరు! ఇటీవలి కాలం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పనపై వివిధ స్థాయిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తూ వచ్చింది.
అందుకు రాజీనామాలకు కూడా సిద్ధమని అప్పట్లో ప్రకటించింది. అధికారంలో ఉన్న వారే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. కాకపోతే ప్రధాన ప్రతిపక్షం అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందజేయాల్సి ఉంటుంది. లేదంటే ప్రజల్లో తనకు ఉన్న సానుభూతి, పలుకుబడిని కోల్పోవాల్సి వస్తుంది.
రాజ్యసభలో 10 ఏళ్లు హోదా కావాలన్న వెంకయ్య
2014 ఎన్నికల్లో పదేళ్లు, 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసి ప్రజాతీర్పు పొందిన పార్టీలు బీజేపీ.. తెలుగుదేశం పార్టీలే. ఆ మేరకు హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కూడా వాటిదేనన్న సంగతి అందరికీ విదితమే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధంగా పని చేస్తున్న ఒక దిన పత్రిక మాత్రం అరవింద్ గోస్వామి రిపబ్లిక్ టీవీ చానెల్లో జగన్ పై వచ్చిన వార్తాకథనానికి తనదైన శైలిలో రంగులద్ది ఏపీ వాసులకు అందిస్తున్నది. కేంద్రాన్ని వైఎస్ జగన్ నిలదీయలేదని ఆ దిన పత్రిక కథనం. కేంద్రాన్ని నిలదీయకుండా... రాష్ట్ర ప్రభుత్వంపై రుసరుసలు వ్యక్తం చేస్తున్నదని మరో వ్యాఖ్య.
వైసీపీ కేంద్రంలో పేరుకు ప్రతిపక్షమైనా, అధికారపక్షానికి అనుబంధంగానే ఉంటోందనేందుకు ఇవన్నీ నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారని తనదైన శైలిలో నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన ఆ దిన పత్రికకు.. అపర చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు నాయుడు.. కేంద్రంలో చక్రం తిప్పగల సామర్థ్యం ఉన్న సంగతి ఆ అనుబంధ దిన పత్రికకు తెలియదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
జగన్ - బీజేపీ మధ్య గాలి జనార్దన్ రెడ్డి మధ్యవర్తిత్వం
ఇదిలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మరో అడుగు ముందుకు వేయనున్నారని, బీజేపీతో చేతులు కలిపేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ప్రముఖ పాత్రికేయుడు ఆర్ణబ్ గోస్వామి నిర్వహిస్తున్న ‘రిపబ్లిక్ టీవీ' ఈ విషయం తెలిపింది. ‘అత్యంత విశ్వసనీయ వర్గాల'ను ఉటంకిస్తూ... ఆదివారం ఈ కథనాన్ని ఇచ్చింది. ‘‘జగన్ బీజేపీతో చేతులు కలిపేందుకు అంతా సిద్ధమైంది. బీజేపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. బీజేపీ అధిష్ఠానానికీ, జగన్కు మధ్య గాలి జనార్దన రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. జగన్ను ఆయనే బీజేపీలోని ముగ్గురు ముఖ్య నాయకుల వద్దకు తీసుకెళ్లారు. ఎన్డీయేలో భాగస్వామి అయ్యేందుకు జగన్ తన సమ్మతి తెలియచేశారు'' అని రిపబ్లిక్ టీవీ తెలిపింది. త్వరలో వైఎస్ జగన్ ‘హస్తిన'లో పర్యటించి మరోసారి బీజేపీ నేతలతో సమావేశం కానున్నారని ఆ చానెల్ కథనం.
ఎక్కువ సీట్లు పొందడంపైనే బీజేపీ నజర్
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ లక్ష్యాల సాధనకు బీజేపీ స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటోంది. ‘‘బరిలో నిలిచి పరుగు తీస్తూ ఉంటాం. పార్టీని బలోపోతం చేస్తూ వెళతాం. టీడీపీతో ఉండాలా? వైసీపీతో పొత్తు పెట్టుకోవాలా? అనేది ఎన్నికల నాటికి నిర్ణయిస్తాం'' అని బీజేపీ జాతీయ స్థాయి నేత ఒకరు చెప్పారు. జగన్పై ఉన్న అవినీతి అభియోగాలను ఆయన తేలిగ్గా తీసుకున్నారు. దాని విషయంలో ఎలా వ్యవహరించాలో తమకు తెలుసునని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు ఇచ్చే వారే కావాలి అని సూటిగానే చెప్పారు.
ఇలా చేస్తామని బిజెపి....
‘‘మాది రాజకీయ పార్టీ. రాజకీయ లాభ నష్టాలకే ప్రాధాన్యమిస్తాం. చంద్రబాబుతో లాభమనుకుంటే ఆయనతో ఉంటాం! లేదంటే వేరే నిర్ణయం తీసుకుంటాం'' అని తేల్చి చెప్పారు. బీజేపీ అధిష్ఠానం నుంచి ఇలాంటి సంకేతాలు వెలువడిన మరుసటి రోజే.. ‘ఎన్డీయేలోకి జగన్' అంటూ రిపబ్లిక్ టీవీ పేర్కొనడం విశేషం. వచ్చే ఎన్నికల్లో తమకు అత్యధిక సీట్లు కేటాయించే పార్టీతోనే తాము కలిసి పోటీ చేస్తామని కమలనాథులు అంటున్నారు.