రిషికేశ్వరి: రోజా ఆగ్రహం, ఏపీ-టీ నేతల ఫోన్లని టిడిపి ట్విస్ట్, ఆయేషా మాటేమిటి?
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి కేసులో... ఎట్టకేలకు ప్రిన్సిపల్ బాబు రావు పైన గురువారం నాడు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య అనంతరం దాదాపు మూడు వారాల అనంతరం ఫిర్యాదు చేశారు.
గురువారం నాడు వర్సిటీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల రాకతో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, ఇతరులు వీసీ ఛాంబర్ వద్ద బైఠాయించి ప్రిన్సిపల్ పైన చర్యలకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రార్ ప్రిన్సిపల్ పైన ఫిర్యాదు చేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ వర్సిటీ హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. హాస్టల్ను తనిఖీ చేసి విద్యార్థులు, వార్డెన్లతో మాట్లాడారు. అక్కడ ఉన్న వసతుల పైన అడిగి తెలుసుకున్నారు. రిషికేశ్వరి మృతి కేసును సిబిఐచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగింది.
నాగార్జున వర్సిటీలో పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సెటిల్మెంట్ నేతగా మారారని ఆరోపించారు. మీ కూతురే ఆత్మహత్య చేసుకుంటే ఇలాగే వదిలేస్తారా అని ప్రశ్నించారు.
రిషికేశ్వరి ఆత్మహత్యను చిన్న విషయంగా కొట్టి పారేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కమిటీ సభ్యులు తమ చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టారని ఎద్దేవా చేశారు. రిషికేశ్వరి రూంలో సౌకర్యాలు బాగున్నాయని, తమ రూంలో బాగా లేవని సీనియర్లు ఆమె రూంలోకి వెళ్తామని గొడవ చేయడంతో.. మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారని రోజా మండిపడ్డారు.
అందుకే మీ కూతురు ఆత్మహత్య చేసుకుంటే ఇలాగే ఏం చేయకుండా ఊరుకుంటారా అని తాము వర్సిటీ అధికారులను నిలదీశామని చెప్పారు. అప్పుడు తెల్ల కాగితం తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. మంత్రి గంటా శ్రీనివాస రావు, ఇతర మంత్రుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు యువతుల ప్రాణాలు పోయాయన్నారు.
టిడిపి ప్రభుత్వంలో ర్యాగింగ్ రెక్కలు విప్పుకుందన్నారు. నిన్న వట్టిచెరువులో సునీత కూడా ఆత్మహత్య చేసుకుందన్నారు. బాబురావును ఏ1 ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్ని ప్రాణాలు పోతున్నా వీసీ మాత్రం ఆయనకు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని మండిపడ్డారు.
లెక్చరర్లనుకూడా లైంగికంగా వేధించిన ప్రిన్సిపల్ బాబురావునుకాపాడే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రిన్సిపల్ బాబురావు హాయ్ లాండ్కు వెళ్లిన విషయం తనకు తెలియదని వీసీ చెప్పడం విడ్డూరమన్నారు.
ప్రిన్సిపల్ వర్సిటీ కాంపౌండు నుంచి బయటకు తీసుకు వెళ్లినందుకు అప్పుడే కేసు పెట్టాలన్నారు. డేవిడ్ రాజులాంటి అసిస్టెండ్ ప్రొఫెసర్లు గట్టిగా అడుగుతుంటే, ఆయనను ఇక్కడి నుంచి తరిమేసిన విషయం నిజం కాదా అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ కూడా ధీటుగానే స్పందించింది. రిషికేశ్వరి మృతిని రాజకీయం చేయాలని చూస్తున్నారని టిడిపి నేతలు మండిపడ్డారు. టిడిపి నేత అనురాధ మాట్లాడుతూ... ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
రిషికేశ్వరి మృతి నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని పార్టీలు ఆమె తల్లిదండ్రులకు ఫోన్లు చేసి రమ్మంటున్నారని, అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన నమ్మకంతో వారు వెళ్లడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఉన్న నేతలు ఆయేషా కేసు పైన ఇలాగే స్పందించారా అని ప్రశ్నించారు.
రిషికేశ్వరి కేసులో వైసీపీ నేత రోజా, టిడిపి నేత అనురాధ కొత్త విషయాలు చెప్పడం గమనార్హం. సౌకర్యాల గొడవ విషయంలోనే రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకుందని రోజా చెప్పగా, కొన్ని పార్టీలు రిషికేశ్వరి తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నారని అనురాధ చెప్పారు. అదే సమయంలో ఆయేషా కేసును ప్రస్తావించారు.