పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వరా? అవమానం: టీడీపీ మూకుమ్మడి దాడి, ఇదీ జగన్ ప్లాన్: లోకేష్
అమరావతి: జగన్ పైన పథకం ప్రకారమే దాడి జరిగిందని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య వేరుగా చెప్పారు. పాదయాత్రకు హైప్ రావడం లేదని ఇలా దాడికి కుట్ర చేసుకున్నారని ఆరోపించారు. కుట్రను భగ్నం చేసినందుకే ఏపీ పోలీసులపై జగన్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ట్విస్ట్: 'జగన్పై ప్రాణాపాయంలేని దాడి జోస్యం నిజమైంది, సీఎం చేయాలనే పిచ్చి అభిమానమే'
ఆంధ్రప్రదేశ్ పోలీసులకు జగన్ స్టేట్మెంట్ ఇవ్వకపోవడం ఏమాత్రం సరికాదని వర్ల రామయ్య చెప్పారు. సీఆర్పీసీ చట్టానికి లోబడే అందరూ పని చేయాలని చెప్పారు. ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ సుబ్బారావు సత్తనెపల్లి వైసీపీ అభ్యర్థిగా రానున్నారని చెప్పారు. తెలంగాణ పోలీసులు ఏ విధంగా ఈ కేసును దర్యాఫ్తు చేస్తారని ప్రశ్నించారు.
పోలీసులకు జగన్ క్షమాపణ చెప్పాలి
ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగాన్ని జగన్ అవమానించారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. 70 వేల మంది పోలీసులు శాంతిభద్రతలను కాపాడుతున్నారని చెప్పారు. జగన్ పాదయాత్రకు 300 మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారని చెప్పారు. ఏపీ పోలీసు శాఖకు జగన్ క్షమాపణ చెప్పాలన్నారు.
ఇదీ జగన్ ప్లాన్.. లోకేష్
ఏపీ పోలీసులు విచారిస్తే కత్తి డ్రామాలు బయటపడతాయనే భయం జగన్లో ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. కేంద్రం నిర్వీర్యం చేసిన మోడీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నాటకాన్ని రక్తి కట్టించి టీడీపీపై నింద వేయాలనేది జగన్ ప్లాన్ అని ఆరోపించారు.
ఓ గవర్నర్ అలా ఉండటం ఎంత వరకు సబబు
గవర్నర్ నరసింహన్ తీరుపై టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర తీవ్రంగా మండిపడ్డారు. ఓ వైపు టిట్లీ తుఫాను కారణంగా సర్వం కోల్పోయి ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోకుండా గవర్నర్ ప్రతిపక్ష నేత జగన్ విషయంలో మాత్రం వెంటనే స్పందించడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ పైన దాడి జరిగిన వెంటనే గవర్నర్ నేరుగా డీజీపీని సమాచారం అడగటం ఏమిటన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఒక గవర్నర్ అలా ప్రవర్తించడం ఎంత వరకు సబబు అన్నారు. పాదయాత్ర పేరుతో జగన్ రాష్ట్రమంతా తిరిగినా ఎలాంటి ఘటనలూ చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. అంత సెక్యూరిటీ ఉంటే ఎయిర్ పోర్టులో ఎలా జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం పరిధిలో ఉండే ఎయిర్ పోర్టులో రక్షణ లేకుంటే ఎలా అన్నారు.
బీజేపీ, వైసీపీ కుట్ర
జగన్ క్రిమినల్ మైండ్తో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని జూపూడి ప్రభాకర రావు అన్నారు. జీవితకాల సీఎం కావాలని తొందరపడుతున్నారని విమర్శించారు. జగన్ పైన దాడి ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ, వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ తన అభిమానితో దాడి చేయించుకొని అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని, జగన్ ఘటన గురించి డీజీపీతో ప్రత్యేకంగా గవర్నర్ ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ఏపీలో రాష్ట్రపిత పాలన పెట్టాలని బీజేపీ, వైసీపీ కుట్ర పన్నుతున్నాయన్నారు.