పాతకక్షలు: జగన్ పార్టీ ఉపసర్పంచ్ దారుణ హత్య
విజయవాడ: కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉప సర్పంచ్ కృష్ణారావును ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. గత రాత్రి ఇంట్లో ఉన్న కృష్ణారావును ప్రత్యర్థులు బయటకు లాక్కొచ్చి కర్రలతో దాడి చేసి కొట్టి చంపారు.
పాత కక్షలు,గ్రామంలో ఇరు పార్టీల మధ్య ఆదిపత్య పోరే హత్యకు కారణ మని గ్రామస్థులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, కృష్ణారావు మృతదేహంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కంచికచర్ల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కృష్ణారావును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నందిగామ నియోజకవర్గ ఇన్చార్జి జగన్మోహన్రావు పాల్గొన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిరసనలతో హైదరాబాద్- విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఫిర్యాదు సమగ్రంగా ఇస్తే నిందితులను అదుపులోకి తీసుకుంటామన్న పోలీసుల హామీతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తమ ఆందోళన విరమించారు.
తమ పార్టీ నేత కృష్ణారావు హత్యను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పార్థసారథి ఖండించారు. కృష్ణారావుకు ప్రాణభయం ఉందనీ రక్షణ కల్పించాలనీ గతంలోనే తాము జిల్లా ఎస్పీని కోరామని ఆయన చెప్పారు. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ హత్య జరిగిందని ఆయన సోమవారం ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం, మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కలిసి చేసిన హత్య అని ఆయన వ్యాఖ్యానించారు.