వైసీఎల్పీ కీలక భేటీ: రోజా సస్పెన్షన్, స్పీకర్ అవిశ్వాసంపైనే చర్చ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో ప్రతిపక్షం వైసీపీ ఈరోజు కీలక సమావేశం నిర్వహించనుంది. ఈరోజు మధ్యాహ్నం వైసీపీ శాసనసభాపక్ష సమావేశాన్ని మంగళవారం లోటస్పాండ్లోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్, స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ప్రతిపాదించనున్న అవిశ్వాస తీర్మానంపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు శాసనసభ లాబీల్లో విలేకరులతో మాట్లాడినప్పుడు స్పష్టం చేశారు.
‘‘సభాపతిపై అవిశ్వాసం పెడదామని మావాళ్లు అంటున్నారు. ఎమ్మెల్యేలతో చర్చించి చూద్దాం'' అని జగన్ చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ సమావేశాల నుంచి ఏడాది పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడు ప్రతిపాదించాలన్న అంశంపై కూడా వైసీపీ ఈరోజు నిర్ణయం తీసుకోనుంది.
ఇప్పటికే రోజా సస్పెన్షన్పై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు పార్టీ అధినేత వైయస్ జగన్ సోమవారం ప్రకటించారు. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపైనా ఈరోజు మధ్యాహ్నాం జగన్ అధ్యక్షతన జరగనున్న వైసీఎల్పీ భేటీలో చర్చించనుంది. ఇది ఇలా ఉంటే ఈరోజు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో విజయవాడ కల్తీ మద్యం అంశాన్ని అధికారపక్ష ఎమ్మెల్యేలు ఈరోజు శాసనసభ దృష్టికి తీసుకురానున్నారు.
ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శ్రీనివాసులరెడ్డి, శ్రవణ్కుమార్ చర్చలో పాల్గొనున్నారు. విశాఖలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణ, ఆస్తినష్టాల విషయాన్ని భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు సభ దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంది. బాక్సైట్ తవ్వకాలు, ఇసుక విధానంపై మంత్రి పీతల సుజాత ప్రకటన చేయనున్నారు.