అదేం భేటీ బాబు? వైఎస్ ఉండగా: ఏకేసిన వాసిరెడ్డి పద్మ
ఆయన తీరు చూస్తే ఐఏఎస్, ఐపీఎస్లను తమ ఉద్యోగాల్లో కొనసాగనిస్తారా లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు. కలెక్టర్లు, ఎస్పీల భేటీలో చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తే టీడీపీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నట్లుగా ఉందన్నారు. ఆల్ ఇండియా సర్వీసుల్లో పని చేస్తున్న కలెక్టర్లు, ఎస్పీలను వారి యూనిఫాంలు వదిలేసి, పసుపుపచ్చ యూనిఫాంలను వేసుకోవాలని ఆదేశించినట్లుగా చంద్రబాబు మాట్లాడారన్నారు.
రాష్ట్రంలో పరిపాలనకు ఒక దిశా నిర్దేశనం చేయడానికి నిర్వహించిన ఈ సమావేశాల్లో పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలని, పరిపాలనను ఎలా నడిపించాలి అనే విషయాలు చెప్పకుండా దానిని పూర్తిగా రాజకీయ సమావేశంగా నిర్వహించారన్నారు. మీరు గానీ, మేము గానీ ఒక స్పష్టతతో పని చేయాలని, అంతిమంగా ఇది రాజకీయ పరిపాలన అనేది గుర్తుంచుకోవాలని చంద్రబాబు అధికారులతో మాట్లాడారని అరోపించారు.
ఎంతసేపు మేము, మా టీడీపీ, మా పార్టీ కార్యకర్తలు అనే ఆయన సమావేశంలో చెప్పారని, దీనిని బట్టి మొత్తం ఉన్నతాధికారులు టీడీపీ వైపుకు మళ్లించే విధంగా ప్రయత్నించారన్నారు. చంద్రబాబు దేనికి ముఖ్యమంత్రో చెప్పాలన్నారు. 'అంతా అయిపోయాక మీరెవరు కనిపించరు, మేం మళ్లీ కార్యకర్తల వద్దకు వెళ్లాలి. వారికి జవాబు చెప్పాలి. కలెక్టర్లు, ఎస్పీలు బాగా పని చేస్తేనే మా పార్టీకి ఆయా జిల్లాల్లో ఐదారు ఎమ్మెల్యే సీట్లు అదనంగా వస్తాయి' అని చంద్రబాబు చెప్పడంలో అర్థమేమిటన్నారు.
చంద్రబాబు వాలకం చూస్తే ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసుల్లో ఉన్న వారిని వాటిలో కొనసాగనిస్తారా లేక టీడీపీ సర్వీస్ అనే సర్వీసును ప్రారంభించి వీరందరినీ అందులో చేర్పిస్తారా అని ఎద్దేవా చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత ఏ పార్టీకి చెందిన వారైనా ఒకటే అనే దృక్పథంతో వ్యవహరించారన్నారు. చంద్రబాబు నాటి తొమ్మిదేళ్ల పాలనలోను అలాంటి స్ఫూర్తి కొరవడిందన్నారు. ఇప్పుడు అదే విధానం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.