2019నుండి ముప్పై ఏళ్లు నేనే, పవన్ గాలి లేదు: జగన్
విశాఖ: 2019లో తానే ముఖ్యమంత్రిని అవుతానని, 2049 వరకూ తనే అధికారంలో కొనసాగుతానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ వ్యాఖ్యానించారట. బుధవారం అనకాపల్లి లోకసభ నియోజకవర్గంలోని అసెంబ్లీ అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలతో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు.
పార్టీ ఓటమికి గల కారణాలను కార్యకర్తల నుంచి అడిగి తెలుసుకున్నారు. అయితే, పార్టీ శ్రేణులు ఎవ్వరిమీదా ఫిర్యాదు చేయలేదు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మాయ మాటలు విని కొంతమంది మోసపోయారన్నారు. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ గాలి ఏమాత్రం లేదని జగన్ స్పష్టం చేశారు. కేవలం రైతులు రుణ మాఫీపై ఆశపడి చంద్రబాబుకు ఓటు వేశారన్నారు.

చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల రుణ మాఫీ విషయంలో చంద్రబాబు చేసిన ప్రకటన విని తాము మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.
బాబు ఇచ్చిన హామీలు నెరవేరే వరకూ ప్రజల పక్షాన నిలబడి పోరాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టినట్టయిందన్నారు. ఐదేళ్ళ తరువాత చంద్రబాబు అధికారం నుంచి తప్పుకుంటారని, తను అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో వెలుగులు నింపుతానని జగన్ చెప్పారు. తను అధికారంలోకి వచ్చాక రాష్ట్రం, దశ, దిశను మార్చుతానన్నారు.












Click it and Unblock the Notifications