వేట కొడవళ్లతో నరికి వైయస్సార్ కాంగ్రెసు నేత హత్య
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత చెన్నారెడ్డి దారుణహత్యకు గురయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించింది. ధర్మవరం మండలం బడనపల్లి సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పథకం ప్రకారం చెన్నారెడ్డిని వేట కొడవళ్లతో నరికి చంపేశారు.
బడనపల్లి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చెన్నారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి చెన్నారెడ్డి పార్టీలో కొనసాగుతూ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తుండటాన్ని రాజకీయ ప్రత్యర్థులు జీర్ణించుకోలేక హత్య చేశారని అంటున్నారు..
బుధవారం ఉదయం బడనపల్లి సమీపంలోని పంట పొలాల వద్ద పనులను పర్యవేక్షిస్తుండగా కొందరు గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో చెన్నారెడ్డిపై దాడి చేసి హత్యచేశారు. విషయం తెలుసుకున్న చెన్నారెడ్డి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర చేస్తుండగా ఈ హత్య జరగడం కలకలం రేపింది.