మోడీ, అమిత్షాకు సంకేతాలు పంపించిన జగన్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఒకరకంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మాత్రం తమజోలికి రావొద్దన్న సంకేతాలను బీజేపీకి పంపించారు. సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమపై దాడులు చేస్తున్నాయనే విషయాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్లాలని. అయితే ఈ విషయాన్ని పైపైన వెల్లడించి బీజేపీకి మద్దతుగా ఉంటామనే విషయాన్ని మాత్రం నేరుగా చెప్పేశారు.
టీడీపీకి ఒకటే ఎక్కువ
వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యుల బలం ఉందని, బీజేపీ ఇప్పటికైనా తమపైనే ఆధారపడాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఒక్క రాజ్యసభ సభ్యుడు కూడా లేడని, మొత్తం ఆ పార్టీకి ఉన్న ఎంపీలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీకి ఒక ఎంపీనే ఎక్కువ అని చెప్పారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్పిన విషయాలనే పదే పదే చెబుతూ వైసీపీ రాష్ట్రానికి ఏం సాధించిందని తెలుగుదేశం పార్టీ నాయకులు నిలదీస్తున్నారు.

బీజేపీ నిర్ణయం ఏంటి?
2014-19 సమయంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమిలోనే ఉన్నప్పటికీ బీజేపీతో జగన్ సన్నిహిత సంబంధాలను పెట్టుకున్నారు. ఈ సంబంధాలు కుదరడంలో విజయసాయిరెడ్డిది కీలక పాత్ర. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరుతో ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావాలంటూ టీడీపీపై ఒత్తిడి తెచ్చారు. అయితే అప్పటికన్నా ఇప్పుడు మరింత బలహీనంగా వైసీపీ ఉంది. ఆ పార్టీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో తమ మద్దతు బీజేపీకి ఉంటుందని సంకేతాలు పంపించడం జాతీయ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మోడీ, అమిత్షాకు జగన్ సంకేతాలు పంపించారని, ఈ విషయంలో బీజేపీ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఆ నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ ప్రభావితమవుతుందా? అనేది మాత్రం భివిష్యత్తులోనే తేలనుంది.












Click it and Unblock the Notifications