బాలకృష్టను టార్గెట్ చేసిన జగన్ పార్టీ: హిందూపురంలో ఉద్రిక్తత
వైఎస్ జగన్ పార్టీ నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేసింది. హిందూపురంలో ధర్నాకు ప్రయత్నించిన వైసిపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అనంతపురం: హిందూపురం తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టార్గెట్ చేసింది. ఆ కారణంగా శనివారం హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బాలకృష్ణ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, హిందూపురంలో కూరగాయల మార్కటె్ను నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధర్నాకు దిగింది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. హిందూపురం నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పా్రటీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ధర్నాలో పాల్గొనేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
దాంతో నవీన్ నిశ్చల్ ఇంటి వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ధర్నాలో పాల్గొనకుండా అడ్డుకోవడమేమిటని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పోలీసులను నిలదీశారు.
మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల నిరసన తెలియజేసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.ఈ నెల 7వ తేదీ నుంచి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.