సభ్యుల అసంతృప్తి: వెంకయ్యకు క్షమాపణలు చెప్పిన విజయసాయి రెడ్డి
Recommended Video

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా తాను ప్రవర్తించిన తీరుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాక, దీనికి సంబంధించి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు సభాముఖంగా క్షమాపణలు చెప్పారు.

తీవ్ర స్వరంలో హెచ్చరిక
ఏపీ విభజన చట్టంపై మంగళవారం రాజ్యసభలో చర్చ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆయనకు కేటాయించిన సమయం అయిపోయిందంటూ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆయన్ని నిలువరించారు. దీంతో విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఛైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వెల్లోకి దూసుకెళ్లారు. ఇలా చేస్తే సభ నుంచి వాకౌట్ చేస్తానని తీవ్రస్వరంతో హెచ్చరించారు.

క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఈ క్రమంలో విజయసాయి రెడ్డి వైఖరిపై అధికార, విపక్ష సభ్యులందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, బుధవారం రాజ్యసభ ప్రారంభం కాగానే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి విజయ్ గోయల్ మాట్లాడుతూ.. నిన్నటి ఘటనకు సంబంధించి ఛైర్మన్కు విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ సహా ఇతర పార్టీల సభ్యులు మద్దతు పలికారు.

ఇష్టమొచ్చినట్లు కాదంటూ..
విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో విజయసాయి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆయన్ని వారించారు. సభలో సమయం కేటాయించడం తన విధి అని.. సమయం సరిపోకపోతే పొడిగించాలని విజ్ఞప్తి చేయాలే తప్ప ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించకూడదని వెంకయ్య హితవు పలికారు.

క్షమాపణ చెబుతున్నా..
అంతేగాక, మంగళవారంనాటి ఘటనపై వివరణ ఇవ్వాల్సిన పనిలేదని.. తనకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని వెంకయ్య అన్నారు. ఆ తర్వాత ఆజాద్ మాట్లాడుతూ.. ఛైర్మన్పై అమర్యాదకరంగా ప్రవర్తించిన విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారని నిలదీశారు. ఇతర సభ్యులు కూడా విజయసాయి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో.. మంగళవారం నాటి పరిణామాలకు వెంకయ్యనాయుడుకు తాను క్షమాపణ చెబుతున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications