జగన్ వైఖరి, వైయస్ ఫ్రెండ్సే షాక్: 'ఇబ్బంది'ని క్యాష్ చేసుకుంటున్న బాబు!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని.. ఆయన తండ్రి, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉన్న వారే ఎక్కువగా ముంచుతున్నారని చెప్పవచ్చు. ఇందుకు జగన్ వైఖరి కూడా కారణమనే వాదనలు లేకపోలేదు.
నమ్ముకున్న వాళ్లకు, సన్నిహితులకు వైయస్ ఎంతో ప్రాధాన్యత ఇస్తారని, వారు ఏం అడిగినా చేస్తారని, అదే గుణం జగన్లో లేదని వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా మెలిగిన చాలామంది వివిధ సందర్భాలలో ఆరోపణలు చేశారు.
తరిచి చూస్తే, వైయస్ సన్నిహితులే జగన్కు దూరంగా ఉన్నారని, దీనిని బట్టే ఆయన వైఖరి అర్థం చేసుకోవచ్చునని జగన్ పైన మండిపడుతున్న వారు కూడా లేకపోలేదు. సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ వైఖరి మరోసారి చర్చకు వస్తోంది.
భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరడంతో.. ఖాళీ అయిన పీఏసీ చైర్మన్ పదవి పైన నెహ్రూ సహా సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ మాత్రం సీనియర్లను పక్కన పెట్టి డొన్ నుంచి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇవ్వడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
జ్యోతుల నెహ్రూ
2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి నుంచి జ్యోతుల నెహ్రూ గెలుపొందారు. ఆయన చాలా సీనియర్ నేత. అలాంటి నేత పీఏసీ చైర్మన్ పదవి పైన మొదటి నుంచి ఆశ పెట్టుకున్నారు. మొదట అది భూమా నాగిరెడ్డికి దక్కింది. దీంతో నెహ్రూ సైలెంట్ అయ్యారు. భూమా టిడిపిలో చేరాక.. తనకే వస్తుందని నెహ్రూ భావించారు. కానీ బుగ్గనకు కట్టబెట్టారు. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు పట్టం కట్టడంపై జగన్ పైన పార్టీలో అసంతృప్తి నెలకొంది.
సాయి ప్రతాప్
ఆరుసార్లు ఎంపీగా గెలిచిన సాయిప్రతాప్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. సాయిప్రతాప్ వైయస్ రాజశేఖర రెడ్డికి చాలా దగ్గరగా మెలిగేవారు. అలాంటి వ్యక్తి, ఇప్పుడు వైసిపిలో చేరకుండా టిడిపిలో చేరారు. తాను జగన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించానని, కానీ ఆయనే పట్టించుకోలేదని సాయిప్రతాప్ చెప్పారు. సాయిప్రతాప్ టిడిపిలో చేరడం వల్ల కడప, చిత్తూరు జిల్లాలో జగన్కు పెద్ద షాకేనని చెప్పవచ్చు.
కెవిపి రామచంద్ర రావు
వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడైన మరో నేత కెవిపి రామచంద్ర రావు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన జగన్ పార్టీలో చేరేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. జగన్ వైఖరి తెలిసినందువల్లే ఆయన దూరం పాటిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. కెవిపిని వైయస్ ఆప్తమిత్రుడు అనేవారు.
సూరీడు
వైయస్ రాజశేఖర రెడ్డికి ఆప్తుడైన వ్యక్తుల్లో సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరీడు ఒకరు. అతను ఇటీవలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. జగన్ను కాదని చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆర్థిక ఇబ్బందులు
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేసిన వారు చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. అయితే, వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు వైసిపి అధినేత జగన్ ముందుకు రావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓడిపోయిన వారు ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారు. వారికి జగన్ నుంచి ఎలాంటి సహాయం లేదని అంటున్నారు. అలాంటి వారిని కూడా టిడిపి తమ వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందని, జగన్ వైఖరిని టిడిపి క్యాష్ చేసుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
జూపూడి ప్రభాకర రావు
ప్రకాశం జిల్లాలో వైసిపి నుంచి పోటీ చేసిన జూపూడి ప్రభాకర రావు సొంతగా పెద్ద మొత్తంలో ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టారు. అయితే, అతనిని జగన్ పట్టించుకోలేదట. దీంతో అతను తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరారని అంటున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి
గతంలో టిడిపి చేతిలో ఓడిపోయిన పలువురు ఎమ్మెల్యేలు.. ఇఫ్పుడు జగన్ తీరును తప్పుపడుతున్నారని అంటున్నారు. తమకు జగన్ నుంచి సహకారం లేదని అంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ ఫేజ్ 2లో వైయస్ రాజశేఖర రెడ్డి సన్నిహితులే జగన్ను చుక్కలు చూపిస్తున్నారని, ఆయనను ముంచుతున్నారని అంటున్నారు.