లక్ష్యం కోసం.. మరోసారి విప్ జారీ చేసిన జగన్: రోజాపై ఆగ్రహం (పిక్చర్స్)
హైదరాబాద్: తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోజాపై విధించిన సస్పెన్షన్ వ్యవహారానికి సంబంధించి అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సోమవారం నాటి సమావేశాలను బహిష్కరించిన వైసిపి మంగళవారం మరో రకంగా నిరసన తెలిపింది. నల్ల బ్యాడ్జీలతో సమావేశాలకు హాజరైంది.
సోమవారం లోటస్ పాండులో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ విడతలవారీగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి హాజరయ్యే విషయమై చర్చించారు. వారు నల్ల బ్యాడ్జీలతో సభకు వచ్చారు. మూడు రోజుల క్రితం మొన్న నల్ల రంగు దుస్తులతో వారు సభకు హాజరయ్యారు.
ద్రవ్య వినిమయ బిల్లులో పాల్గొనాలని విప్
ద్రవ్య వినిమయ బిల్లు ఓటింగులో పాల్గొనాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో జగన్ మాట్లాడుతూ... 2012 సంవత్సరం నాటి పంట బీమా ఇప్పటికీ రైతులకు సరిగా అందలేదని, వారు ఎదురు చూస్తున్నారని అన్నారు. రైతులకు పంట బీమా చెల్లించక పోవడం దారుణం అన్నారు.
టిడిపిలో చేరిన తన పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలపై వేటు లక్ష్యంగా జగన్ పెట్టిన అవిశ్వాస తీర్మానం షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడం గమనార్హం.
కాగా, సభలో రోజా వ్యవహారంపై చర్చ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. సోమవారం నాడు రోజా సస్పెన్షన్, హైకోర్టు తీర్పు పైన సభలో చర్చించారు. ఈ చర్చకు వైసిపి సభ్యులు గైర్హాజరయ్యారు. అధికార పార్టీకి చెందిన ఎక్కువ మంది సభ్యులు రోజాపై చర్యలకు విజ్ఞప్తి చేశారు.
రోజా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా అంశం దుమారం రేపుతోంది. హైకోర్టు తీర్పుపై సోమవారం అసెంబ్లీలో చర్చించారు. మరోవైపు వైసిపి నిరసనలు తెలియజేస్తూనే ఉంది.
ఏపీ అసెంబ్లీ
భావితరాలకు సరైన సందేశం ఇచ్చేలా, మహిళలు చట్టసభల్లోకి రావడానికి భయపడకుండా భరోసా కల్పించేలా రోజాపై చర్యలు తీసుకోవాలని పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత శాసనసభలో కోరారు. రోజా అంశంపై సోమవారం సభలో చర్చ జరిగిన విషయం తెలిసిందే.
ఏపీ అసెంబ్లీ
ఏడాదిపాటు సస్పెన్షన్ ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్యే రోజాకు సభాహక్కుల సంఘం ముందు వాదనలు వినిపించేందుకు మరో అవకాశం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్ణయం తీసుకొంది. విచారణ పూర్తయ్యే వరకూ సస్పెన్షన్ కొనసాగుతుంది.
ఏపీ అసెంబ్లీ
మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, జ్యోతుల నెహ్రూ చెప్పిన క్షమాపణలను సభ ఆమోదించింది. కొడాలి నాని విషయంలో సభే నిర్ణయం తీసుకోవాలని సభాహక్కుల సంఘం సూచన చేయడంతో ఆయన విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేసింది.
ఏపీ అసెంబ్లీ
డిసెంబర్ 18న సభలో చోటుచేసుకొన్న ఘటనలు, అనంతర పరిణామాలపై సోమవారం శాసనసభలో స్వల్పకాలిక చర్చను చేపట్టారు. ప్రతిపక్షం హాజరు కాకపోవడంతో టిడిపి, బిజెపిలు సభ్యులే ఈ చర్చలో పాల్గొన్నారు.
ఏపీ అసెంబ్లీ
రాజ్యాంగం ప్రసాదించిన ముఖ్యమైన వ్యవస్థ శాసనసభ అని సభాపతి కోడెల శివప్రసాదరావు చెప్పారు. శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ పరస్పరం గౌరవించుకోవాలన్నారు. శాసన వ్యవస్థను న్యాయస్థానాలు ప్రశ్నించలేవన్నారు. చర్చలో ప్రతిపక్షం కూడా పాల్గొంటే సమగ్రంగా ఉండేదన్నారు. అదే సమయంలో సాక్షి పత్రిక అసెంబ్లీ ఘటనకు సంబంధించి వార్త తప్పుగా ప్రచురించినందుకు క్షమాపణ కోరుతూ లిఖితపూర్వక లేఖ ఇచ్చిందన్నారు.
ఏపీ అసెంబ్లీ
సభలో రోజా తీరు సరికాదని టిడిపి ఎమ్మెల్యే శివాజీ అన్నారు. మిగతా అధికార పార్టీ సభ్యులు కూడా అదే అభిప్రాయపడ్డారు. రోజాపై చర్యలు తీసుకోవాలన్నారు.