27 మందితో వైసీపీ రెండో జాబితా: జగన్ ట్రేడ్ మార్క్
YSRCP 2nd list: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల మలి విడత ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. తాజాగా రెండు లోక్సభ, 25 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. 11 మందితో ఇదివరకే తొలి జాబితా విడుదలైన విషయం తెలిసిందే.
ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. చోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్. మలి జాబితాలో అన్ని కులాల వారికీ ప్రాతినిధ్యం కల్పించడం విశేషం.

పార్టీ అవసరాల దృష్ట్యా కొంతమంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానాలను మార్చారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ను రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి ఇన్ఛార్జీగా నియమించారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ను రామచంద్రాపురం నుంచి స్థానచలనం కల్పించారు. ఆయనను రాజమండ్రి రూరల్కు మార్పు చేశారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్కు మార్చారు. ఆయన స్థానంలో మైనారిటీ నేత షేక్ ఆసిఫ్కు అవకాశం ఇచ్చారు. అలాగే యువకులకు అవకాశం కల్పించే ఉద్ధేశంతో మచిలీ పట్నం నుంచి మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్టమూర్తిని ఎన్నికల బరిలో దింపారు.
చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, రామచంద్రాపురం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు పిల్లి సూర్యప్రకాష్కు అవకాశం కల్పించారు. పోలవరం నుంచి తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి అవకాశమిచ్చారు.
తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ పిఠాపురం నుంచి వంగా గీత, జగ్గంపేట నుంచి తోట నరసింహం, ప్రత్తిపాడు నుంచి వరుపుల సుబ్బారావును రేసులో నిల్చోబెట్టారు జగన్. మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో విజయవాడ వెస్ట్ నుంచి షేక్ ఆసిఫ్, గుంటూరు ఈస్ట్ నుంచి షేక్ నూరి ఫాతిమా, కదిరి నుంచి బీఎస్ మక్బూల్ అహ్మద్కు అవకాశం కల్పించారు. వీరందరూ కొత్తవారే.
రాష్ట్రంలోని పలు అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన @ysrcparty ఇంచార్జుల రెండవ జాబితా. pic.twitter.com/Ct4P32XFfU
— YSR Congress Party (@YSRCParty) January 2, 2024
సామాజిక న్యాయం చేస్తామని చెబుతూ వస్తోన్న జగన్.. దానికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు సమ ప్రాధాన్యతను ఇచ్చారు ఈ జాబితాలో. ఎస్పీ సామాజిక వర్గానికి చెందిన కంబాల జోగులుకు పాయకరావుపేట, పీ గన్నవరం ఇన్ఛార్జీ పదవిని విప్పర్తి వేణుగోపాల్, ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్కు అవకాశం కల్పించారు.
ఎస్టీ సామాజికవర్గం నుంచి అరకు ఎంపీ స్థానానికి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి పేర్లను ప్రకటించారు. బీసీ సామాజిక వర్గం నుంచి మార్గాని భరత్, మలసాల భరత్ కుమార్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పిల్లి సూర్యప్రకాష్కు అవకాశం ఇచ్చారు. వైశ్య సామాజిక వర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్కు మలి విడత ప్రాధాన్యత కల్పించారు.
తొలి రెండు జాబితాలను కలిపి మొత్తం 38 మందిని అభ్యర్థులను ప్రకటించినట్టయింది. అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ మార్పులు చేశారు. గతంలో వైయస్. వివిధ కారణాల వల్ల టికెట్ దక్కని వారిని పార్టీ, నామినేటెడ్ పోస్టుల్లో నియమించి వారి సేవలను వినియోగించుకుంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
అన్ని సామాజికవర్గాలకు సమ న్యాయం చేస్తామని, అందరికీ రాజకీయ అవకాశాలను కల్పిస్తామంటూ ముందు నుంచీ చెబుతూ వస్తోన్న జగన్ దాన్ని ఆచరణలో పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ఈ ఇన్ఛార్జీల ఎంపిక జరిగింది. తాను తరచూ చెప్పే సామాజిక న్యాయాన్ని మరోసారి చేతల్లో చూపారు జగన్.












Click it and Unblock the Notifications