ఎంపీ ఎంవీవీకి నో టికెట్: విశాఖ లోక్సభకు వైసీపీ బీసీ అభ్యర్థి ఖరార్
YSRCP: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా రెండు విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 38 మంది కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది.
మూడో విడత జాబితాపై కసరత్తు పూర్తయింది. దీనికి తుది రూపాన్ని ఇస్తోంది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. 25 మంది పేర్లతో ఈ జాబితా వెలువడే అవకాశం ఉంది. ఈ సాయంత్రం దీన్ని విడుదల చేస్తారని తెలుస్తోంది. అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని నియోజకవర్గాలు ఇందులో ఉన్నట్లు సమాచారం.

ఉత్తరాంధ్రలో ప్రతిష్ఠాత్మకమైన విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గానికీ కొత్త అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఎంవీవీ సత్యనారాయణకు మరోసారి టికెట్ కేటాయించట్లేదని, ఆయనను అసెంబ్లీకి పంపిస్తారని చెబుతున్నారు.
ఎంపీ ఎంవీవీ స్థానంలో మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీకి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వనుందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. బొత్స ఝాన్సీ గతంలో విజయనగరం నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. 2009 ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు.

2014లో కూడా అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు గానీ ఓడిపోయారు. మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆ తరువాత ఆమె కుటుంబం వైఎస్ఆర్సీపీలో చేరింది. వైసీపీ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ మంత్రి అయ్యారు. క్రియాశీలక రాజకీయాల్లో బొత్స ఝాన్సీ చురుగ్గా పాల్గొనట్లేదు.
మారిన సమీకరణాల నేపథ్యంలో బొత్స ఝాన్సీ పేరును వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయనగరం బదులుగా విశాఖపట్నం నుంచే పోటీ చేయించేలా కసరత్తు చేస్తోందని అంటున్నారు. ఈ సాయంత్రానికి వెలువడే మూడో జాబితాలో బొత్స ఝాన్సీ పేరు ఉండొచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications