ఒకేలా బాహుబలి, చంద్రబాబు ప్రాజెక్టుల గ్రాఫిక్స్: వైసిపి షాకింగ్, బాబువల్లేనని మంత్రులు
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల డిజన్లు బాహుబలి చిత్రం గ్రాఫిక్స్లా ఉన్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులను ప్రచారం చేసుకునేందుకు చంద్రబాబు క్వాలిటీతో కూడిన గ్రాఫిక్స్ చేయించారని విమర్శించారు.
అయితే, వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఆయన ఆదివారం నాడు రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నో ఎత్తిపోతల పథకాలు రైతులకు ఉపయోగపడటం లేదన్నారు. వాటి గురించి పట్టించుకోకుండా పురుషోత్తమపట్నం పథకం పేరిట ప్రజలను వంచిస్తున్నారన్నారు.
ఒకేసారి రూ. 1,638 కోట్లు విడుదల చేయడం వెనుక కమీషన్ల కక్కుర్తి దాగుందన్నారు. ఈ ప్రాజెక్టుల డిజైన్లు ఎకరా భూమిని కూడా తడపలేవని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంత త్వరగా పనవుతుందని అనుకోలేదు: అచ్చెన్నాయుడు
రాష్ట్రం విడిపోయిన అనంతరం కేవలం రెండున్నరేళ్లలో కొత్త రాజధాని నుంచి పాలన పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని తాను అనుకోలేదని, ఇదంతా తమ పార్టీ అధినేత చంద్రబాబు కృషి వల్లే జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
ఆయన ఆదివారం ఉదయం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్లోకి ప్రవేశించారు. ఆపై యూత్ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని మంత్రి వర్గానికి సిఫార్సు చేస్తూ తొలి సంతకం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. రికార్డు సమయంలో సెక్రటేరియేట్ నిర్మాణం పూర్తయిందని, ఇంత త్వరగా పనులు పూర్తయి, తన శాఖ ఇక్కడ ప్రారంభమవుతుందని తొలుత ఊహించలేదన్నారు. 2018లో జాతీయ క్రీడలను ఏపీలో నిర్వహించనున్నామని చెప్పారు.
సచివాలయ ఘనత చంద్రబాబుదే: కేఈ కృష్ణమూర్తి
కృష్ణా జిల్లా బాపులపాడు వద్ద మెగా ఫుడ్ పార్కు ఏర్పాటుకు 716 ఎకరాలు కేటాయిస్తూ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదివారం తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సచివాలయాన్ని త్వరగా పూర్తి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇక నుంచి పాలన, రాజధాని నిర్మాణం వేగవంతమవుతాయన్నారు.












Click it and Unblock the Notifications