వైసీపీ, జనసేనకు చంద్రబాబు తెచ్చిపెట్టిన కష్టం ఇదే..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూను కల్తీ చేశారని సంచలన ఆరోపణలు చేసిన చంద్రబాబు ఆ తర్వాత దూకుడు తగ్గించారు. అవసరమైతే తప్ప ఈ వ్యవహారంపై స్పందించడం లేదు. కానీ చంద్రబాబు కంటే ఎక్కువగా ఆయన కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ స్పందించేలా చేశారు. అలాగే వీరిద్దరి విమర్శలతో ఇరుకునపడ్డ వైఎస్ జగన్ కూడా స్పందించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏకంగా వైసీపీ, జనసేన క్షేత్రస్ధాయిలో రంగంలోకి దిగాయి.
వాస్తవానికి తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబు.. తన క్యాడర్ కు మాత్రం భారీ ఆందోళనలకు ఎలాంటి పిలుపూ ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్, జగన్ అలా కాదు తమ క్యాడర్ కు క్షేత్రస్ధాయిలో ఆందోళనలకు, ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చారు. తద్వారా సనాతన ధర్మం బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకునేందుకు పవన్, కూటమి వ్యూహాల్ని కౌంటర్ చేసేందుకు జగన్ తమ పార్టీ నేతల్ని క్షేత్రస్దాయిలో తిరిగేలా చేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు లేవు. సార్వత్రిక ఎన్నికలు జరిగి కూడా నాలుగు నెలలే అవుతోంది. ఇలాంటి సమయంలో క్షేత్రస్ధాయిలో ఎంత తిరిగినా ఆయా పార్టీలకు వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదు. కానీ చంద్రబాబు లడ్డూ వివాదంతో జనసేన, వైసీపీ నేతలు, క్యాడర్ మాత్రం జనంలోకి విస్తృతంగా తిరుగుతున్నారు. జగన్ తప్పు చేసాడని జనసేన, చంద్రబాబు, పవన్ తప్పులు చేస్తున్నారని వైసీపీ నేతలు, క్యాడర్ జనంలో తిరుగుతూ విమర్శలు చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికల వాతావరణం లేకపోయినా చంద్రబాబు మాత్రం తమ పార్టీ టీడీపీ నేతలను సైలెంట్ గా ఉంచి వైసీపీ, జనసేనను క్షేత్రస్ధాయిలో పరస్పరం విమర్శలు, నిరసనలు చేసుకునేలా, బిజీగా ఉండేలా చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. తద్వారా టీడీపీపై వీరిద్దరూ ఫోకస్ పెట్టకుండా ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో అసలే నామినేటెడ్ పదవుల తొలిదశ ప్రకటన తర్వాత పార్టీలోనే అసంతృప్తులు కనిపించాయి. అలాగే ప్రభుత్వం సంక్షేమం అమలు నుంచి తప్పించుకుంటోందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ రెండు పార్టీల్ని అలా బిజీగా ఉంచారన్న వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications