విజయనగరంలో వైసీపీ,టీడీపీ కార్యకర్తల రచ్చ... పోలింగ్ బూత్లోనే కుర్చీలతో కొట్టుకున్న నేతలు...
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలోని ఓ పోలింగ్ బూత్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పూసపాటిరేగ మండలం చౌడవరంలోని పోలింగ్ బూత్లో వైసీపీ,టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. కుర్చీలతో కొట్టుకున్నారు. పోలింగ్ బూత్లోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ కేంద్రంలోని అధికారులు,ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు భయాందోళనకు గురయ్యారు.
పోలీసులు రంగప్రవేశం చేసినప్పటికీ.. వారిని కూడా లెక్క చేయకుండా ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు.ఎట్టకేలకు పోలీసులు ఇరువురిని అక్కడినుంచి పంపించేయడంతో గొడవ సద్దుమణిగింది. ఓటర్లను పోలింగ్ బూత్కు తరలించే విషయంలో వైసీపీ,టీడీపీ శ్రేణుల మధ్య తలెత్తిన గొడవే ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది.
రెండో విడత ఎన్నికల సందర్భంలోనూ విజయనగరం జిల్లాలో వైసీపీ,టీడీపీ మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కొమరాడ మండలం విక్రమపురంలో అధికార పార్టీ కార్యకర్తలు తమపై జులుం ప్రదర్శిస్తున్నారని టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో పోలింగ్ కేంద్రంలోనే ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపు చేశారు.
కాగా, మూడో విడత ఎన్నికల్లో భాగంగా మొత్తం 3,221 గ్రామ పంచాయతీలలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇందులో 57 9 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,639 సర్పంచ్ పదవులకు బుధవారం పోలింగ్ జరిగింది. ఈ స్థానాల్లో మొత్తం 7,757 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 19,553 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. 43,612 మంది అభ్యర్థులు వార్డు సభ్యులుగా పోటీలో నిలిచారు.రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని మొత్తం 26,851 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం పోలింగ్ జరిగింది.
సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా మొదట వార్డుల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 63,270 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు.