షాకింగ్: 'ఆ రోజు నంద్యాల వైసీపీ కార్యకర్తల అలజడి, బాబుపై దాడికి యత్నం'
విజయవాడ: గుంటూరులో జరిగిన నారా హమారా, తెలుగుదేశం పార్టీ హమారా సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై దాడి యత్నం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ సభలో నంద్యాలకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలజడి సృష్టించారని చెప్పారు. గతంలో తునిలో రాయలసీమ ఫ్యాక్షనిస్టులతో రైలును తగులబెట్టించారని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మర్గంలో నడుస్తున్నారని, మత కల్లోలాల సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బీజేపీ, జగన్ నాటకాల్లో భాగంగా ఇలాంటివి జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
వైయస్ జగన్కు రాష్ట్రం బాగుపడం ఏమాత్రం ఇష్టం లేదని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. గుంటూరు సభలో తమ కార్యకర్తలతో అల్లరి చేయించారని, ఇది హేయమైన చర్య అన్నారు. బీజేపీ, జగన్ కలిసి రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారన్నారు.
గుంటూరులో జరిగిన నారా హమారా, టీడీపీ హమారా కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించాలని చూశారని అంతకుముందు జలీల్ ఖాన్ కూడా ఆరోపించారు.
ఆ రోజు సభలో జరిగిన గందరగోళానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. అధికారంలో లేనప్పుడే ఇంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక వైసీపీ ఎలా ఉంటుందో, రాష్ట్రం పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, గుంటూరులో నారా హమారా, టీడీపీ హమారా సభలో పలువురు మైనార్టీ వర్గం వారు చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.