కర్నూల్ బంద్: కేఈ తనయుడిపై కేసు, నారాయణరెడ్డి హత్యతో హైటెన్షన్
శ్యామ్ బాబు సహా 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసుల్లో అతన్ని ఏ-14గా చేర్చడం పట్ల వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
కర్నూల్: డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తికొండ నియోజకవర్గంలో వైసీపీ నేత నారాయణరెడ్డి హత్యకు గురడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లుగా ఆరోపణలున్న ఈ కేసులో.. కేఈ కృష్ణమూర్తి అనుచరులకు సంబంధం ఉన్నట్లు ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి.
తెలిస్తే నారాయణరెడ్డిని రక్షించేవాడ్ని: కేఈ, 'చంద్రబాబు రిజైన్ చేయాలి'
అయితే కేఈ మాత్రం ఈ హత్యతో తన అనుచరులకు ఎలాంటి సంబంధం లేదని, ఒకవేళ సంబంధం ఉన్నట్లు తేలితే.. వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు. కేఈ వివరణ ఎలా ఉన్నప్పటికీ.. ఆయన తనయుడు శ్యామ్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్యామ్ బాబు సహా 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసుల్లో అతన్ని ఏ-14గా చేర్చడం పట్ల వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హత్యలో కీలక నిందితుడిగా ఉన్న శ్యామ్ బాబును తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, చెరుకులపాడు నారాయణరెడ్డి, అతని అనుచరుడు సాంబశివుడి హత్య నేపథ్యంలో సోమవారం కర్నూలు జిల్లా బంద్ కు వైసీపీ పిలుపునిచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోల ఎదుట వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రానివ్వకుండా, పెట్రోలు బంకులు, ఇతర వ్యాపార సముదాయాలు తెరవనివ్వకుండా అడ్డుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ర్యాలీలకు దిగుతుండటంతో.. అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది.