హిందూపురంలో బాలయ్యపై వైసీపీ అభ్యర్థి ఖరారు?
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటలా మారిపోయింది. 1983 తర్వాత ఇంతవరకు ఏ పార్టీ ఇక్కడ తన జెండాను రెపరెపలాడించలేకపోతోంది. 1985, 1989, 1994 లో జరిగిన ఎన్నికల్లో పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వరుసగా ఇక్కడి నుంచే పోటీచేసి విజయం సాధించారు. ఆయన మరణం తర్వాత 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో తనయుడు హరికృష్ణ పోటీచేసి గెలుపొందారు.

హ్యాట్రిక్ పై దృష్టిసారించిన బాలయ్య
1999 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ఇతర వ్యక్తులు పోటీచేసి విజయం సాధిస్తూ వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో ఎన్టీఆర్ తనయుడు, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ వరుసగా పోటీచేసి ఘనవిజయం సాధించారు. 2024లో కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే దృక్పథంతో బాలయ్య ఉన్నారు. ఎలాగైనా సరే ఈసారి ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించాలంటే గట్టి అభ్యర్థి ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. అందుకు తగ్గట్లుగా అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు.

మాధవ్ వ్యవహారంతో మారిన రాజకీయ సమీకరణాలు
ఈ క్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం వెలుగు చూడటంతో ఒక్కసారిగా ఇక్కడి నియోజకవర్గంతోపాటు ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయాయి. మాధవ్ ను పత్తికొండ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి బరిలోకి దింపే అవకాశాలు అధికంగా ఉన్నాయి. బాలకృష్ణపై ధీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న వైసీపీకి మహిళా అభ్యర్థి అయితే విజయావకాశాలుంటాయనే కోణంలో కల్యాణ దుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ పై బాధ్యత పెట్టబోతున్నారు.

ఇంతవరకు మహిళలు పోటీచేయలేదు
హిందూపురం నియోజకవర్గం నుంచి 1955లో జరిగిన ఎన్నికలు మినహా ఇంతవరకు ప్రధాన పార్టీల తరఫున మహిళలు పోటీచేయలేదు. ఈసారి ఎన్నికల్లో మహిళ పోటీచేస్తే వారి ఓట్లన్నీ పడే అవకాశం ఉందని, అలాగే బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటంలేదనే వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుందనేది వైసీపీ అధిష్టానం ఆలోచనగా ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి బాలకృష్ణ మీద దాదాపుగా ఉషాశ్రీచరణ్ పోటీచేయడం ఖాయమేనని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications