నలుగురూ ఏకగ్రీవమే - రాజ్యసభకు నామినేషన్లు : మా లక్ష్యాలు క్లియర్..!!
వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్ధులుగా ప్రకటించిన నలుగురు ఈ రోజు తమ నామినేషన్లను దాఖలు చేసారు. విజయ సాయిరెడ్డి.. బీదా మస్తానరావు.. ఆర్ క్రిష్ణయ్య.. నిరంజన్ పార్టీ నేతలతో కలిసి నామినేషన్లను ఫైల్ చేసారు. శాసనసభలో మెజార్టీ కారణంగా నాలుగు సీట్లు వైసీపీకి దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. పోటీగా నామినేషన్ దాఖలైతే వచ్చే నెల 10వ తేదీన పోలింగ్ తేదీగా నిర్ణయించారు. అయితే, ఎవరూ పోటీకి దిగే అవకాశాలు కనిపించటం లేదు. దీంతో..ఈ నలుగురి ఎన్నిక దాదాపు ఏకగ్రీవమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ నలుగురి అధికారికంగా ఎన్నిక జరిగిన తరువాత రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య 9కి చేరుతుంది. ముఖ్యమంత్రి జగన్ ఆశయాల మేరకు నడుచుకుంటామని అభ్యర్ధులు స్పష్టం చేసారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పారు. రాష్ట్ర సమస్యలను పార్లమెంట్, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి సమన్వయం చేసుకుంటూ ప్రజల ప్రయోజనాలను, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతామన్నారు. రాజ్యసభ రాష్ట్రాల సభ కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషిచేస్తామన్నారు. జాతీయ పార్టీలతో వైసీపీ విధానం ఏంటో..పార్టీ ముఖ్యనేత విజయ సాయిరెడ్డి స్పష్టం చేసారు.
రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినా, ఏ ఇతర పార్టీ వ్యవహరించినా దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు. ప్రస్తుత రాజ్యసభ సభ్యులతో జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఈ సామాజిక వర్గాలను మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి పరిచేవిధంగా.. పనితనం కూడా అదేరకంగా ఉంటుందన్నారు. కేంద్రంతో ఏ సమస్య మీద అయితే పోరాడాలో.. దానిపైనే పోరాడాలి కానీ, ప్రతిపక్షం, చంద్రబాబు చెప్పినట్టుగా ప్రతిదానిపై కేంద్రంపై పోరాడటం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమో.. వాటిపైనే కేంద్రంతో పోరాడాలన్నారు. రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో పనిచేయాలని... అదే తమ ఆశయం.. ఆ వైపుగా పయనిస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేసారు.