రోజాకు తాడేపల్లి నుంచి పిలుపు..!!
YS Jagan: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక, కొత్త ఇన్ఛార్జీల నియామకాలు, రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. ఇంకో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పులు మున్మందు మరిన్ని సంచలనాలను తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదివరకే వైఎస్ఆర్సీపీ తొలి జాబితాను విడుదల చేసింది. రెండో విడత లిస్ట్ విడుదలలో జాప్యం చోటు చేసుకుంటోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ముందుగా అనుకున్నట్లుగా కొద్దిమందితో కాకుండా భారీ స్థాయిలోనే మార్పులు చేయాలని చివరి నిమిషంలో పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకోవడమేదీనికి కారణమని తెలుస్తోంది.

తాజాగా రెండో జాబితాపై దాదాపుగా సిద్ధమైనట్టేనని తెలుస్తోంది. మొత్తంగా 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మార్పులు ఉండొచ్చు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో ఈ మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. ఈ జాబితా ఈ సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది.
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు సమావేశాలకు మూడు రోజుల పాటు బ్రేక్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. నేడు మళ్లీ వాటిని పునఃప్రారంభించింది. ఉమ్మడి ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అభ్యర్థుల మార్పు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కకపోవచ్చని చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మంత్రి రోజాకు కూడా ఈ సారి పోటీ చేసే అవకాశం ఉండదంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది తేలిపోనుంది. నేడో, రేపో ఆమె జగన్ను కలుస్తారని సమాచారం.
చిత్తూరు శాసన సభ్యుడు ఆరణి శ్రీనివాసులు, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానంద్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. విజయానంద్ రెడ్డి చిత్తూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికి వైఎస్ జగన్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications