జగన్ను డిఫెన్స్లో పడేశాం, యాక్టివ్గా లేడు: బాబు, మంత్రులకు క్లాస్
హైదరాబాద్: శాసస సభలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని డిఫెన్సులో పడేశామని, జగన్ ఇతరులు చెప్పిన దానిని అప్పజెప్పుతున్నాడే తప్ప యాక్టివ్గా ఉండటం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు వ్యాఖ్యానించారు.
ఏపీ శాసన సభ రేపటికి వాయిదా పడిన అనంతరం చంద్రబాబు పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభను మూడు రోజులుగా సమర్థవంతంగా నిర్వహించామని చెప్పారు.
సభలో జగన్ పార్టీని పూర్తిగా డిఫెన్సులో పడేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమస్యలను, విభజన సమస్యల పైన జగన్ సభలో ప్రస్తావించలేదన్నారు. దీనిని బట్టే రాష్ట్ర ప్రయోజనాల పైన జగన్ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోందన్నారు. కొందరు మంత్రులు, అధికారులు ఇచ్చిన సమాచారాన్నే జగన్ అప్ప చెబుతున్నారని, యాక్టివ్గా ఉండటం లేదన్నారు.
అంతకుముందు సభలో కూడా జగన్ పైన చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. జగన్ భాష మార్చుకోవాలని హితవు పలికారు. సభా నాయకుడిని అవమానించేలా మాట్లాడుతున్నారన్నారు.
మైండ్ సెట్ మారాలి: మంత్రులకు బాబు హితవు
సభలో మైండ్ సెట్ మారాలని, పద్ధతి మార్చుకోవాలని సీఎం చంద్రబాబు కొందరు మంత్రులకు సూచించినట్లుగా తెలుస్తోంది. సభలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరు బాగా లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వారికి హెచ్చరించారని తెలుస్తోంది.