కాల్మనీ: 'జగన్ చలించిపోయారు, చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్టు వ్వవహరిస్తున్నారు'
అమరావతి: అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చెందిన కాల్మనీ వ్వవహారంపై హైకోర్టు జడ్జితో విచారణకు ఆదేశించాలని వైసీపీ డిమాండ్ చేసింది. వైసీపీ నేతలు కె. పార్థసారధి, వాసిరెడ్డి పద్మ సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణకు ఎందుకు ఆదేశించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కాల్మనీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్టు వ్వవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసును నీరు గార్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాల్మనీ దందాలో బాధితులకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రే మాఫియాకు కొమ్ముకాసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కాల్మనీ దందా గురించి పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు వస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాల్ మనీ దందా గురించి తెలియగానే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చలించిపోయారని, తీవ్ర మనస్తాపం చెందారని ఆమె అన్నారు.
రాజకీయాల కోసం ఇంతకు దిగజారతారా అని ఆమె ప్రశ్నించారు. కాల్ మనీ బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబుకు ప్రతిపక్ష నేత వైయస్ రాసిన బహిరంగ లేఖను పార్థసారధి, వాసిరెడ్డి పద్మ ఈ సందర్భంగా విడుదల చేశారు.
కాల్మనీ కేసులో ప్రధాన నిందితులు వైసీపీ నేతలే: పంచుమర్తి అనురాధ
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ వ్యవహారంలో ప్రధాన నిందితులు వైసీపీ నేతలేనని తెలుగు మహిళా అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాల్మనీ వ్యవహారంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.
కాల్మనీ వ్యవహారంలో దౌర్జన్యానికి పాల్పడిన వారిపై నిర్భయం కేసులు నమోదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇది ఇలా ఉంటే ఈ కేసులో నిందితుడిగా ఉన్న బౌన్సర్ భవానీ శంకర్తో పాటు మరో నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.