తొక్కిసలాట: 'చంద్రబాబుదే బాధ్యత', 'క్రిమినల్ కేసు పెట్టాలి'
హైదరాబాద్: రాజమండ్రి కోటగుమ్మం పుష్కరఘాట్లో జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విపక్షాలు సీఎం చంద్రబాబుపై తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తాయి. మంగళవారం హైదారాబాద్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుర్నాధరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పుష్కర మరణాలు చంద్రబాబు హత్యలే అని ఆరోపించారు.
2004లో కృష్ణా పుష్కరాల సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుని ఐదుగురు మరణించారు. అప్పట్లో ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని అప్పటి సీఎం వైయస్ రాజశేఖరరెడ్డిని చంద్రబాబు డిమాండ్ చేసిన సంఘటనను గుర్తు చేశారు.
ఇప్పుడు 27 మంది మరణించిన చంద్రబాబు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
చంద్రబాబుపై క్రిమినల్ కేసు: గండ్ర వెంకట రమణారెడ్డి
రాజమండ్రి పుష్కరఘాట్లో జరిగిన తొక్కిసలాటలో 27 మంది చనిపోవడం బాధాకరమని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పుష్కర ఏర్పాట్ల వైఫల్యం వల్ల అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
దీనికి కారణమైన సీఎం చంద్రబాబుపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తెలుగు ప్రభుత్వాలు స్పందించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ పై కూడా గండ్ర మండిపడ్డారు.
తెలంగాణలో పుష్కర ఏర్పాట్లలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పుష్కర ఘాట్లలో నీటి కొరతతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి గోదావరి జలాలను రప్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు.