ఆ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ సిట్టింగులకు సరైనోళ్లు తగిలారు..!!
విశాఖపట్నం: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ప్రత్యర్థి పార్టీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని, 175 స్థానాల్లోనూ పార్టీ జెండా ఎగరాలనే పట్టుదలతో ఉన్నారు. దీనికోసం వైనాట్ 175 కాన్సెప్ట్ను ప్రవేశ పెట్టారు.
తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న కుప్పం, హిందూపురం, విశాఖపట్నం తూర్పు.. వంటి నియోజకవర్గాల్లోనూ పాగా వేయాల్సి ఉంటుంది. దీనికోసం వైసీపీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. కుప్పంలో ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ విస్తృతంగా పర్యటిస్తోన్నారు. ప్రతి ఇంటికీ వెళ్తోన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను జనానికి మరింత చేరువ చేస్తోన్నారు.

పార్టీ సీనియర్ నేత, విద్యుత్, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురంలో మకాం వేశారు. ఇటీవలే ఆయన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గం యువ నాయకురాలు టీఎన్ దీపిక ఇక్కడి నుంచి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇదివరకే ఆమెను ఇన్ఛార్జీగా నియమించింది వైసీపీ.

తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా భావించే నియోజకవర్గాల్లో విశాఖపట్నం తూర్పు ఒకటి. ఇక్కడి నుంచి వెలగపూడి రామకృష్ణబాబు హ్యాట్రిక్ కొట్టారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ, 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆయన మట్టికరిపించారు. భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.

ఈ నియోజకవర్గంపై వైఎస్ఆర్సీపీ దృష్టి సారించింది. వెలగపూడిపై అభ్యర్థిని సిద్ధం చేసింది. విశాఖపట్నం లోక్సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణను బరిలోకి దించింది. ఆయనను విశాఖ తూర్పు ఇన్ఛార్జీగా నియమిస్తూ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కావడం వల్ల ఈ సారి గెలుపు కోసం టీడీపీ కష్టపడక తప్పదనే అభిప్రాయాలు ఉన్నాయి.
మూడుసార్లు గెలిచిన వెలగపూడిపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉందనే ప్రచారం నియోజకవర్గంలో ఉంది. ఈ సారి గట్టి ప్రత్యర్థి తగిలితే ఓటమి తప్పదనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. అక్కడి రాజకీయ పరిణామాలు, మారిన ఈక్వేషన్లకు అనుగుణంగా వైసీపీ.. విశాఖ తూర్పులో ఎంవీవీని బరిలోకి దించిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications