స్పీకర్పై అవిశ్వాసం, ఆమె కోసం ఢిల్లీకెళ్తా: జగన్, బాబు వంశానికి మంచిదికాదని రోజా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభా సభాపతి కోడెల శివప్రసాద రావు పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రోజా సస్పెన్షన్, ఏపీ అసెంబ్లీ సమావేశాల పైన వైసిపి అధ్యక్షులు జగన్ అధ్యక్షతన లోటస్ పాండులో ఆ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జగన్ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోను రోజా సస్పెన్షన్ అంశాన్ని వదిలి పెట్టే ప్రసక్తి లేదని జగన్ చెప్పారు. అవసరమైతే ఈ సస్పెన్షన్ విషయమై ఢిల్లీ వెళ్లి అక్కడి న్యాయనిపుణులను కలుస్తానని చెప్పారు.
స్పీకర్ కోడెల శివప్రసాద రావు మొదటి నుంచి ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారని జగన్ ఈ భేటీలో వ్యాఖ్యానించారు. స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు జగన్ చెప్పారు.
వైసిపి శాసన సభా పక్షం భేటీ అనంతరం రోజా విలేకరులతో మాట్లాడారు. ఏపీలో ఉన్న మహిళలు అంతా కంటతడి పెడుతున్నారని, ఇది మీ వంశానికి, కుటుంబానికి ఏమాత్రం మంచిది కాదని రోజా మండిపడ్డారు. కనకపు సింహాసనం మీద శునకాలను కూర్చోబెట్టినట్లుందని మా గురించి మంత్రి రావెల కిషోర్ అన్నారన్నారు.
నాతో పెట్టుకున్న వాళ్లు ఎవరూ బతికి పట్టకట్టలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటారని, అంటే చంపేస్తారా అని ప్రశ్నించారు. ఇంత వరకు చరిత్రలో ఏ ప్రభుత్వానికి రాని చెడ్డపేరు మొదటి 18 నెలల్లోనే చంద్రబాబు మూటగట్టుకున్నాడన్నారు. దేశంలో ఎక్కడా జరగని దారుణాలు విజయవాడలో జరుగుతున్నాయని, పైగా బెజవాడకు చెడ్డపేరు తెచ్చేందుకు నేను ప్రయత్నిస్తున్నానని చెప్పడం సిగ్గుచేటు అన్నారు.