సంచైత వ్యవహారంలో పంతం నెగ్గించుకున్న వైసీపీ: రాజు గారికి మిగిలిన ఆప్షన్ అదేనా !
సంచైత గజపతిరాజును మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా అర్ధరాత్రి రహస్య జీవోల సాయంతో నియమించారని ఆరోపణలు వెల్లువెత్తినా ఆ విషయంలో ఎదురైన అన్ని ఇబ్బందులను వైసీపీ అధిగమించినట్లే కనిపిస్తోంది. సంచైత నియామకంపై ఏపీ బీజేపీ నేతలు కేంద్రంలోని పెద్దలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో వారు కూడా దీన్ని లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో బాధితుడిగా మిగిలిన మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు న్యాయపోరాటమే శరణ్యంగా మారింది.

సంచైత నియామకం ఖాయమైనట్లే..
విజయనగరంలోని పూసపాటి రాజవంశీకులకు చెందిన మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా సంచైత గజపతిరాజు నియామకంలో తలెత్తిన ఇబ్బందులను వైసీపీ సర్కారు అధిగమించినట్లే కనిపిస్తోంది. తొలుత రహస్య జీవోలతో సంచైతను నియమించారని ఆరోపణలు చేసిన టీడీపీతో పాటు ఆ పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు న్యాయనిపుణులతో సంప్రదింపుల తర్వాత మెత్తబడినట్లు తెలుస్తోంది. నియామకంలో తొలుత వారు లేవనెత్తిన పలు అంశాలు న్యాయసమీక్షలు నిలబడవని తేలిపోవడంతో నియామకం జరిగిన తీరుపై మాత్రమే పోరాడేందుకు వారు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ పెద్దల స్పందన కరవు..
తమ పార్టీకి చెందిన సంచైత గజపతిరాజును ఎవరికీ కనీస సమాచారం లేకుండా మాన్సాస్ ఛైర్ పర్సన్ గా నియమించారని, 13 వేల ఎకరాల ట్రస్టు భూములను కొట్టేసేందుకే వైసీపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని ఏపీ బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, మాథవ్ ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని కేంద్రంలోని బీజేపీ పెద్దలకు నివేదించి సంచైతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా కోరారు. అయితే సంచైతకు బీజేపీ అధిష్టానం పెద్దల వద్ద ఉన్న పరిచయాలతో ఈ వ్యవహారం మూలనపడింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వీరికి ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది. దీంతో ఏపీ బీజేపీ నేతలు కూడా ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.

టీడీపీ వాదనకూ స్పందన కరవు..
మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా ఉన్న టీడీపీ నేత అశోక్ గజపతిరాజును తప్పించి ఆయన అన్నకూతురు సంచైతను ఆ పదవిలో కూర్చోబెట్టింది వైసీపీ. దీంతో ఈ వ్యవహారంపై టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. సంచైత నియామకం అక్రమమని పేర్కొంటూ ఈ అంశాన్ని ఉత్తరాంధ్ర ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది.. అయితే అశోక్ గజపతిరాజూకూ, ఆయన అన్న ఆనంద్ గజపతిరాజుకు మధ్య విభేదాలతో పాటు పూసపాటి వంశీకుల గురించి బాగా తెలిసిన ఉత్తరాంధ్ర వాసులు సంచైత వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకున్నారు. దీంతో ఆ వ్యతిరేకత కూడా పనిచేయలేదు.

రాజు గారికి చివరి ఆప్షన్...
బీజేపీ నేతల ద్వారా ఓవైపు అధిష్టానంపై ఒత్తిడి చేస్తూ, మరోవైపు కేంద్రానికి ఫిర్యాదులు పంపుతూ, ఇంకోవైపు ప్రజల్లోకి సంచైత వ్యవహారాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన అశోక్ గజపతిరాజు కమ్ టీడీపీ దారుణంగా విఫలమయ్యారు. దీంతో అశోక్ కు ఇప్పుడు న్యాయపోరాటమే శరణ్యంగా మారింది. అదీ పూర్తి స్దాయిలో సంచైత నియామకాన్ని వ్యతిరేకించే స్దాయిలో ఉందా అంటే అదీ కుదిరేలా కనిపించడం లేదు. వాస్తవానికి ఈ విషయాన్ని సంచైత నియామకం తర్వాత అశోక్ తన తొలి ప్రెస్ మీట్లోనే చెప్పేశారు. సంచైతను నియమించే అధికారం వైసీపీ ప్రభుత్వానికి ఉందంటూనే నియామకం జరిగిన తీరు మాత్రం సరిగా జరగలేదన్నారు. ఇప్పుడు అదే అంశంపై ఆయన న్యాయపోరాటాన్ని కొనసాగించేలా ఉన్నారు. అయితే ఓసారి న్యాయప్రక్రియ మొదలైతే అది పూర్తవడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు.












Click it and Unblock the Notifications