ఇంట్లో దీక్ష చేసిన జగన్ టిడిపిని అడగటమా?: సోమిరెడ్డి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం నిప్పులు చెరిగారు. లోటస్ పాండులోని ఇంట్లో కూర్చొని దీక్ష చేస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్ష గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కైన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇక ఆ పార్టీతో ఏం పోరాడుతారని ప్రశ్నించారు. జగన్ తెలుగు జాతి కోసం ప్రాణాలర్పిస్తానంటున్నారని, ఆయనేమన్నా పొట్టి శ్రీరాములా అని ప్రశ్నించారు. జగన్ ఇంట్లో దీక్ష చేయగా, తమ అధినేత ఢిల్లీలో ఎండలో, వర్షంలో దీక్ష చేశారన్నారు.
జగన్ పిలుపుతో అక్టోబర్ 2న దీక్ష చేపట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆ మర్నాడే విరమించారని ఎద్దేవా చేశారు. అది కుమ్మక్కు కాదా అని ప్రశ్నించారు. జగన్ దీక్షల పేరుతో లోటస్ పాండు దాటి బయటకు రాలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీల మధ్య బెయిల్ డీల్ కుదిరిందన్నారు.
తమ పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి రైలులో కాకుండా బస్సులో వెళ్తారా అని ప్రశ్నించారు. బాబు దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలు భోజనాలు చెయ్యకూడదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి అభివృద్ధి కోసం పుట్టిందన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు అన్ని నష్టపోయి 75 రోజుల పాటు సమ్మె చేస్తా కేంద్రం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.