జగన్ వద్దకు బందరు పంచాయతీ-కూర్చుని మాట్లాడుకోవాలని నాని, బాలశౌరికి సూచన
ఏపీలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ అధిష్టానానికి పార్టీలో గ్రూపు తగాదాలు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల గ్రూపు తగాదాలు పెరుగుతున్నాయి. అయినా వీటిని నియంత్రించలేని పరిస్దితుల్లో అధిష్టానం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ దశలో తాజాగా మచిలీపట్నంలో ఎంపీ,ఎమ్మెల్యే మధ్య చోటు చేసుకున్న గ్రూపు తగాదాలు కొత్త సమస్యగా మారాయి.
మచీలీపట్నం ఎంపీ బాలశౌరి స్ధానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్నినానిని ఉద్దేశించి నిన్న చేసిన వ్యాఖ్యలు కృష్ణాజిల్లాతో పాటు రాష్ట్రంలోనూ కలకలం రేపాయి. తనను బందరు రాకుండా అడ్డుకోవడం పేర్నినాని వల్ల కాదంటూ బాలశౌరి చేసిన వ్యాఖ్యలు బందరు వైసీపీలో ఉన్న గ్రూపు తగాదాల్ని బయటపెట్టాయి. దీంతో ఇప్పుడు జిల్లాల్లో రెండువర్గాలకు చెందిన వారి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దీనిపై వైసీపీ అధిష్టానం స్పందించింది. ఈ వ్యవహారంపై సీఎం జగన్ వివరాలు తెప్పించుకుని ఇరువర్గాలతో మాట్లాడినట్లు తెలుస్తోంది.
బందరు వైసీపీలో పేర్నినాని, బాలశౌరి మధ్య నెలకొన్న విభేధాలకు కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని అధిష్టానం నుంచి సందేశం అందింది. అలాగే ఇరువర్గాల మధ్య విభేదాలకు సంబంధించి ఇద్దరూ బహిరంగ వ్యాఖ్యలు చేసుకోవద్దని కూడా అధిష్టానం సూచించింది. దీంతో అధిష్టానం చేసిన సూచనపై ఇరువర్గాలు ఎలా స్పందిస్తాయన్నది చూడాల్సి ఉంది. మరోవైపు ఎంపీ బాలశౌరి తనపై చేసిన వ్యాఖ్యలపై పేర్నినాని త్వరలో స్పందిస్తానని ప్రకటించారు. అయితే అధిష్టానం సూచన నేపథ్యంలో పేర్ని నాని ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి నెలకొంది.