బాంబులు, కత్తులతో దాడి: జగన్ పార్టీ పత్తికొండ ఇంచార్జ్ దారుణ హత్య, కర్నూలు ఎస్పీ స్పందన
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిపై ఆదివారం ఉదయం ప్రత్యర్థులు దాడి చేసి, హత్య చేశారు.
కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిపై ఆదివారం ఉదయం ప్రత్యర్థులు దాడి చేసి, హత్య చేశారు. ఆయన పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా కృష్ణగిరి వద్ద అడ్డగించి, దాడికి పాల్పడ్డారు.
నారాయణ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అతనిపై కత్తులు, బాంబులతో విచక్షణారహితంగా దాడి చేశారు. నారాయణ రెడ్డితో పాటు అతని అనుచరుడిపై దాడి చేశారు. ఘటనలో ఇధ్దరు మృతి చెందారు.
కరణం వర్గీయుల హత్య: హంతకులు ఎవరో తెలిసింది!
నారాయణ రెడ్డి తన అనుచరుడితో కలిసి వెళ్తుండగా వాహనాన్ని అడ్డుకొని హత్య చేశారు. తొలుత బాంబులు వేశారు. ఆ తర్వాత వేట కొడవళ్లు, కత్తులతో దాడి చేశారు.
నారాయణ రెడ్డి స్వగ్రామం డోన్ నియోజకవర్గంలోని చెరుకులపాడు. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక గాలి బలంగా వీచింది. అయినప్పటికీ 31వేలకు పైగా ఓట్లు సాధించారు. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన నిర్దోషిగా బయటపడ్డారు.
దోషులను వదిలి పెట్టం: కర్నూలు ఎస్పీ
నారాయణ రెడ్డి, ఆయన అనుచరుడి హత్య కేసులో దోషులను వదిలి పెట్టేది లేదని కర్నూలు ఎస్పీ రవికృష్ణ అన్నారు. దాడికి ఎవరు పాల్పడ్డారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. నారాయణరెడ్డి, సాంబశివుడు హత్యలకు ఫ్యాక్షన్ గొడవలు కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.